హైదరాబాద్: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా భారత జట్టు స్టార్ ఆటగాళ్లు నగరంలో సెంచరీలతో మెరుపులు పుట్టిస్తున్నారు. ఆదివారం జరిగిన సౌరాష్ట్ర, ఝార్ఖండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. సౌరాష్ట్ర జట్టులో ఆడిన రవీంద్ర జడేజా 116 బంతుల్లో 113 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 7 ఫోర్లు 4 సిక్సులతో బంతిని పరుగులు పట్టించాడు.
ఝార్ఖండ్తో విజయ్ హజారే ట్రోఫీ వన్డే మ్యాచ్లో అతడు రాణించడంతో సౌరాష్ట్ర 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత ఝార్ఖండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 329 పరుగులు సాధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (93) చెలరేగి జట్టుకు భారీ స్కోరు అందించాడు. అనంతరం సౌరాష్ట్ర మరో 4 బంతులు మిగిలివుండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
సికింద్రాబాద్ లోని జింఖానా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పూజారా, జడేజా కలిసి 73పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జడేజా అజేయ సెంచరీతో సత్తాచాటగా.. ఉతప్ప (32), పుజారా (44) చేసి జట్టుకు బలాన్ని చేకూర్చారు.
తమిళనాడుపై ఆంధ్ర పైచేయి:
జాతీయ స్థాయిలో జరుగుతోన్న విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర జైత్రయాత్ర కొనసాగుతోంది.ఆదివారం జరిగిన మ్యాచ్ తో ఆంధ్రా జట్టు టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. 16 పాయింట్లతో గ్రూపు-సిలో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్ బెర్తుకు చేరువైంది.
ఆదివారం ఆంధ్ర 29 పరుగుల ఆధిక్యంతో తమిళనాడుపై విజయం సాధించింది. మొదట ఆంధ్ర 5 వికెట్లకు 276 పరుగులు చేసింది. భరత్ (82), సుమంత్ (62 నాటౌట్) రాణించి జట్టుకు మెరుగైన స్కోరు అందించారు. అనంతరం తమిళనాడు 48.5 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.