2025లో క్రికెట్ ప్రపంచం ఎందరో దిగ్గజాలను చూసింది. కానీ ఓ అనామక క్రికెటర్ సృష్టించిన సునామీ ముందు అందరూ చిన్నబోయారు. ఈ ఏడాది భారత టీ20 జట్టు ప్రదర్శన అద్భుతంగా సాగింది. టీమిండియా విజయాల్లో ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. 21 మ్యాచ్ల్లో 895 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. ఈ ఏడాది భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. అయితే అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక పరుగుల జాబితాలో అతను 7వ స్థానానికే పరిమితమయ్యాడు. మరి మొదటి స్థానం సాధించిన ఆ బ్యాటర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరీ కరణ్బీర్ సింగ్?
టీమిండియా స్టార్ క్రికెటర్ అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ.. ఆస్ట్రియాకు చెందిన కరణ్బీర్ సింగ్ ఏకంగా రెండు ప్రపంచ రికార్డులను బద్ధలు కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో అంతగా పరిచయం లేని ఆస్ట్రియా బ్యాటర్ కరణ్బీర్ సింగ్ 2025లో పరుగుల వరద పారించాడు. కనీవినీ ఎరుగని రీతిలో అతను నెలకొల్పిన రెండు ప్రపంచ రికార్డులు ఇవే:

1. ఒకే ఏడాదిలో అత్యధిక టీ20 పరుగులు: కరణ్బీర్ 32 మ్యాచ్ల్లో 51.31 సగటుతో ఏకంగా 1488 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 13 అర్థ సెంచరీలు ఉన్నాయి. తద్వారా 2021లో మహమ్మద్ రిజ్వాన్ (1326 పరుగులు) నెలకొల్పిన రికార్డును కరణ్బీర్ బద్దలు కొట్టాడు.
టాప్ బ్యాటర్ల జాబితా (ఒకే ఏడాదిలో):
*కరణ్బీర్ సింగ్ (ఆస్ట్రియా): 1488 పరుగులు (2025)
*మహ్మద్ రిజ్వాన్ (పాక్): 1326 పరుగులు (2021)
*సూర్యకుమార్ యాదవ్ (భారత్): 1164 పరుగులు (2022)
2. సిక్సర్ల సెంచరీ - 122 సిక్సర్లు: టీ20 చరిత్రలో ఒకే క్యాలెండర్ ఇయర్లో 100 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా కరణ్బీర్ రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది అతను మొత్తం 122 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఫియాజ్ అహ్మద్ (బహ్రెయిన్) కేవలం 69 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. అంటే కరణ్బీర్ ఎంతటి విధ్వంసం సృష్టించాడో అర్థం చేసుకోవచ్చు. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన కరణ్బీర్ సింగ్ ఇప్పటివరకు తన కెరీర్లో 41 టీ20 మ్యాచ్లు ఆడి 169.22 స్ట్రైక్ రేట్తో 1721 పరుగులు చేశాడు. కేవలం చిన్న జట్లపైనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేస్తూ ఇప్పుడు క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు.