తన కెరీర్ తొలినాళ్లలో బూట్లు కూడా కొనలేక ఎంత ఇబ్బంది పడ్డాడో గుర్తు చేసుకున్నాడు హైదరాబాదీ స్టార్ టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్. కుటుంబ అవసరాల కోసం తాను ప్రతీరోజు టెన్నిస్ బాల్ మ్యాచ్లు ఆడాల్సి వచ్చేదని భావోద్వేగానికి గురయ్యాడు. 'నెక్ట్స్ సిరాజ్ ఎవరు?' పేరుతో హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో టాలెంట్ హంట్ ను MSK ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ (MSKSICA) నిర్వహించగా.. ఆ కార్యక్రమంలోనే సిరాజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
అదే లక్ష్యంగా..
క్రికెటర్లుగా ఎదగాలని కలలు కనే నిరుపేద పిల్లల్లో ప్రతిభను గుర్తించి వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా 'తదుపరి సిరాజ్ ఎవరు' అంటూ ఫాస్ట్ బౌలింగ్ ట్రయల్స్ను నిర్వహించారు. ఆరాంఘర్లోని విజయానంద్ గ్రౌండ్స్లో దీన్ని నిర్వహించారు. బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ MSK ప్రసాద్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, భారత స్టార్ పేసర్ మమ్మద్ సిరాజ్, TNGO జనరల్ సెక్రటరీ ముజీబ్ ఆధ్వర్యంలో ఈ ట్రయల్స్ను ప్రారంభించారు. ఈ ట్రయల్స్ లో దాదాపు 400 మంది ఔత్సాహిక క్రికెటర్లు పాల్గొనడం విశేషం.

ఉన్నత స్థాయికి ఎదగాలని..
ఇంకా ఈ ఈవెంట్ లో సిరాజ్ మాట్లాడుతూ.. ఎమ్మెస్కే ప్రసాద్ నిర్వహిస్తున్న ఈ ట్రయల్స్ను ఉపయోగించుకుని యంగ్ క్రికెటర్స్ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని, ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించాడు. ఆ తర్వాత.. ప్రతిభావంతులైన, పేద పిల్లలను వెలుగులోకి తీసుకురావడానికి నిస్వార్థంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పారు. అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. తన బాల్యంలో క్రికెట్ ఆడిన రోజులను గుర్తు చేసుకున్నారు. యువ క్రికెటర్లు ఈ ట్రయల్స్ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
