
హైదరాబాద్: ఆదివారం సింగపూర్ క్రికెట్ జట్ట చరిత్ర సృష్టించింది. ముక్కోణపు టీ20 సిరీస్లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో సింగపూర్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)లో పూర్తి సభ్యత్వం కలిగిన దేశంపై సింగపూర్ తొలి విజయాన్ని నమోదు చేసినట్లైంది.
మ్యాచ్కి ముందు వర్షం పడటంతో 18 ఓవర్లకు కుదించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన సింగపూర్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. సింగపూర్ జట్టులో ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. ఓపెనర్లు రోహాన్ రంగరాజన్(22 బంతుల్లో 39), సురేంద్రన్ చంద్రమోహాన్(23) పరుగులతో చక్కటి శుభారంభాన్నిచ్చారు.
జింబాబ్వే ఆటగాళ్లలో కెప్టెన్ సీమ్ విలియమ్స్(66), ముటోంబోడ్జి(32)లు రాణించినా ఆ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. సింగపూర్ బౌలర్లలో మహబూబ్, జనక్ ప్రకాశ్ తలో రెండు వికెట్లు సాధించగా, విజయ్ కుమార్, గోపీనాథ్ ఆచర్లు చెరో వికెట్ తీశారు. తాజా విజయంతో ముక్కోణపు టీ20 సిరిస్లో సింగపూర్ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి.