
హైదరాబాద్: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఇండోనేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ క్వార్టర్స్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్లో భాగంగా మహిళల సింగిల్స్లో రెండో సీడ్ సింధు 23-21, 21-7 తేడాతో గ్రెగోరియా మరిస్కా (ఇండోనేసియా)పై విజయం సాధించింది.
పీవీ సింధు తొలి గేమ్ను పోరాడి గెలవగా, రెండో గేమ్లో సునాయాసంగా విజయం సాధించింది. కేవలం 37 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో సింధు తన అనుభవాన్ని ఉపయోగించి మ్యాచ్ని సొంతం చేసుకుంది. క్వార్టర్స్లో పీవీ సింధు స్పెయిన్కు చెందిన కరోలినా మారిన్తో తలపడే అవకాశం ఉంది.
ఇక, పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ పోరులో ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 21-14, 21-9 తేడాతో కెంటో నిషిమోటో (జపాన్)పై విజయం సాధించి క్వార్టర్స్లోకి అడుగుపెట్టాడు. ఈ పోరులో కిదాంబి శ్రీకాంత్ ఏకపక్షంగా విజయం సాధించాడు. తొలి గేమ్ను 21-14తో గెలిచిన శ్రీకాంత్.. రెండో గేమ్ 21-9తేడాతో సొంతం చేసుకున్నాడు.