టీ20 వరల్డ్ కప్ లో జింబాబ్వే దూసుకెళ్తోంది. ఆస్ట్రేలియాను మట్టికరిపించిన తర్వాత శ్రీలంక పనిపట్టింది. సొంత గడ్డపై ఆ జట్టును ఉతికి ఆరేసింది. సంచలన విజయాన్ని అందుకుంది. గ్రూప్-బీలో భాగంగా గురువారం సాయంత్రం కొలంబోలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో సమష్టిగా రాణించింది. 6 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ గెలుపుతో గ్రూప్ బీలో టాపర్గా నిలిచిందీ అండర్ డాగ్ టీమ్. ఆస్ట్రేలియాపై సాధించిన గెలుపు.. గాలివాటం కాదని నిరూపించుకుంది.
తొలుత బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసింది. ఓపెనర్ శ్రీలంక పాథుమ్ నిశ్వంక మరోసారి రెచ్చిపోయాడు. మెరుపువేగంతో హాఫ్ సెంచరీ చేశాడు. అతనికి పవన్ రత్నాయకే తోడయ్యాడు. 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 44 పరుగులతో సత్తా చాటాడు. జింబాబ్వే బౌలర్లలో ముజర్బాని, బ్రాడ్ ఇవాన్స్, గ్రేమ్ క్రీమర్ రెండు చొప్పున వికెట్లు పడగొట్టారు. ర్యాన్ బర్ల్ ఓ వికెట్ తీసుకున్నాడు.

అనంతరం జింబాబ్వే 19.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ 48 బంతుల్లో 8 ఫోర్లతో 63 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కేప్టెన్గా సికందర్ రజా 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో చెలరేగాడు. టడివనకే మారుమాణి- 34, ర్యాన్ బర్ల్ (12 బంతుల్లో 23) మెరుపు ఇన్నింగ్స్, అలాగే టోనీ మున్యోంగా చివర్లో వేగంగా ఆడారు. సూపర్ 8లో చేరిన శ్రీలంక బౌలర్లు నిరాశపరిచారు. దుషన్ హేమంత రెండు వికెట్లు తీయగా.. డాసన్ షనక, దునిత్ వెల్లాలగె చెరో వికెట్ పడగొట్టారు.
ఆస్ట్రేలియాపై సాధించిన విజయం యాదృచ్ఛికం కాదని జింబాబ్వే మరోసారి నిరూపించింది. ఈ సంచలన విజయం తర్వాత, సోషల్ మీడియా జింబాబ్వే, ఆ జట్టు కేప్టెన్ సికందర్ రజా పేరు హోరెత్తిపోతోంది. జెయింట్ కిల్లర్ గా ప్రశంసలు అందుకుంటోంది. మీమ్స్, పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. జింబాబ్వే జట్టును ఇకపై అండర్ డాగ్ గా చూడకూడదని, సూపర్ 8 లో ఏ జట్టునైనా ఓడించే సత్తా దానికి ఉందని నెటిజన్లు హెచ్చరిస్తోన్నారు.
ఈ టోర్నమెంట్ లీగ్ దశలో సికందర్ రజా హీరోగా నిలిచాడని, తన జట్టుకు అపూర్వ విజయాలను అందించాడని ప్రశంసిస్తోన్నారు. భారత్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్- లీగ్స్ లో అజేయంగా ఉన్న ఈ జట్లన్నీ సూపర్ 8లో ఒకే గ్రూపులో ఉండటం అత్యంత ఆసక్తికరపోరుకు దారి తీసినట్టయింది. సూపర్ 8లో జింబాబ్వేకు పటిష్టమైన వెస్టిండీస్, భారత్, దక్షిణాఫ్రికా వంటి దిగ్గజాలతో తలపడనుంది. ఇది ప్రపంచ క్రికెట్లోని దిగ్గజాలను మరోసారి ఓడించే గొప్ప అవకాశాన్ని జింబాబ్వే అందుకున్నట్టయింది.