
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును తొలిసారిగా జింబాబ్వే ప్లేయర్ సికందర్ రజా గెలుచుకున్నాడు. నామినేషన్లో ఉన్న ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్, న్యూజిలాండ్కు చెందిన మిచెల్ సాంట్నర్లను ఓడించి అతను ఆగస్టు నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకున్నాడు. ఆగస్టులో అతను మూడు వన్డే సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే. 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నందుకు తాను చాలా సంతోషంగా ఉన్నాను, దీన్ని గౌరవంగా భావిస్తున్నాను, ఈ అవార్డును గెలుచుకున్న మొదటి జింబాబ్వే ప్లేయర్ నేను కావడం గర్వంగా ఉంది.
గత మూడు నాలుగు నెలలుగా మా జట్టు టెక్నికల్ స్టాఫ్కి, నాతో పాటు ఆడే ప్లేయర్లకు, మా సపోర్ట్ టీంకు నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మీరు అంతా నా వెన్నంటి ఉండడం వల్లే ఈ అవార్డు దక్కింది. లేకుంటే ఇది సాధ్యం కాదు. ముఖ్యంగా నన్ను నిరంతరం ప్రోత్సహించే మా జింబాబ్వే అభిమానులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞుడను' అని అతను పేర్కొన్నాడు.
36ఏళ్ల సికిందర్ రజా ఆగస్టు నెలలో బంగ్లాదేశ్పై తొలి సెంచరీ సాధించాడు. 135పరుగులతో నాటౌట్గా నిలిచాడు. 304 పరుగుల ఛేదనలో జింబాబ్వే 62/3 వద్ద కష్టాల్లో ఉన్న సమయంలో బరిలోకి దిగిన రజా.. సహచరుడు ఇన్నోసెంట్ కాయతో కలిసి నాల్గవ వికెట్కు కీలకమైన 192పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దీంతో జింబాబ్వే తొలి వన్డేలో బంగ్లాదేశ్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. రజా తర్వాతి మ్యాచ్లోనూ 127బంతుల్లో 117నాటౌట్తో తన ఫామ్ను కొనసాగించాడు.
దీంతో రెండో మ్యాచ్ కూడా జింబాబ్వే గెలుపొంది సిరీస్ 2-1తో కైవసం చేసుకుంది. అలాగే భారత్తో జరిగిన మూడోది మరియు చివరి వన్డే మ్యాచ్లోనూ రజా 115పరుగులు చేశాడు. దాదాపు గెలిపించినంత పనిచేశాడు. చివరికి జింబాబ్వే 13పరుగుల తేడాతో ఓటమిపాలయింది. దీంతో భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.