

హైదరాబాద్: ఏం చేసినా పరవాలేదు గ్రౌండ్లో కనిపించాలంతే.. అనుకునే ఆటగాళ్ల చాలా అరుదు. ఇలాగే, గతేడాది భారత్ వేదికగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ జరిగిన సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా ఓ మ్యాచ్కు దూరమయ్యాడు. ఆ తర్వాత మ్యాచ్లో కోహ్లీ మైదానంలో ఉన్న సహచర ఆటగాళ్లకు డ్రింక్స్ అందజేస్తూ కనిపించాడు. తాజాగా భారత్-ఐర్లాండ్ మధ్య శుక్రవారం జరిగిన రెండో టీ20లో కూడా ఇలాంటి సన్నివేశమే కనిపించింది.
అప్పుడు కోహ్లీ చేస్తే.. ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ సహచర ఆటగాళ్ల కోసం డ్రింక్స్, కిట్ బ్యాగ్లను మోసుకెళ్లాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ నాలుగు మార్పులు చేశాడు. ధోనీ, ధావన్, భువనేశ్వర్, బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చి.. రాహుల్, దినేశ్కార్తీక్, ఉమేశ్ యాదవ్, సిద్దార్థ్ కౌల్లను తుది జట్టులోకి తీసుకున్నాడు.
అయితే.. ధోనీ హాయిగా ఏసీ గదిలో కూర్చుని విశ్రాంతి తీసుకోలేదు. సహచర ఆటగాళ్ల కోసం 12వ ఆటగాడిగా మారాడు. వారి కోసం మైదానంలోకి డ్రింక్స్, కిట్ బ్యాగ్లు తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారాయి. మైదానంలో బ్యాటింగ్కు దిగిన సురేశ్ రైనా పదే పదే బ్యాట్, గ్లౌజులు తీసుకురావాలంటూ డ్రెస్సింగ్ రూమ్లోని సభ్యులకు సూచించాడు. ఆ సమయంలో ధోనీ ఏ మాత్రం చిరాకు తెచ్చుకోకుండా అన్నిసార్లు తానే మైదానంలోకి కిట్ బ్యాగ్ను తీసుకొనివెళ్లాడు.
అలాగే ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్కు డ్రింక్స్ అందించాడు. ఈ ఫొటోలు చూసిన అభిమానులు 'ప్రపంచం మెచ్చిన డ్రింక్స్ మ్యాన్; జట్టు కోసం ఏమైనా చేసేవాడు; కొత్త అవతారంలో ధోనీ, క్రికెట్లో నీ ప్రదర్శన చూసి అభిమానులయ్యాం.. కానీ, నీ మంచి ప్రవర్తన చూసి మేమంతా నీకు బానిసలైపోయాం; మిలియన్ డాలర్ డ్రింక్స్ మ్యాన్' అంటూ కామెంట్లు పెట్టారు.