
హైదరాబాద్: విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తానని ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడుతున్న సిద్ధార్థ్ కౌల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడి 11 వికెట్లు సాధించాడు. 2008లో విరాట్ కోహ్లీ నాయకత్వంలో అండర్-19 వరల్డ్ కప్ జట్టులో కౌల్ సభ్యుడిగా ఉన్నాడు.
తాజాగా కౌల్ మాట్లాడుతూ "విరాట్ కోహ్లీనే నాకు స్ఫూర్తి. గత పదేళ్లుగా అతడు జట్టులో ఎంతో స్థిరంగా రాణిస్తున్నాడు. నేను త్వరలో టీమిండియాలో చోటు దక్కించుకుంటానన్న నమ్మకం ఉంది. శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం నన్ను ఎంపిక చేశారు. కానీ, ఆడే అవకాశం దక్కలేదు. త్వరలోనే కోహ్లి నాయకత్వంలో నేను భారత్ తరపున కచ్చితంగా ఆడతా' అని ధీమా వ్యక్తం చేశాడు.
మరొకవైపు ఐపీఎల్ తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాడు. 'ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో బౌలింగ్ చేయడాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను. నా శక్తి సామర్థ్యాలన్నింటినీ ఉపయోగించి బౌలింగ్ చేస్తున్నా. నాతో పాటు మిగతా బౌలర్లు చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. ఇది కూడా నాకు సాయపడుతోంది' అని కౌల్ వివరించాడు.
శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో కౌల్ చోటు దక్కించుకున్నాడు. కానీ, ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం లభించలేదు. ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆడిన 8 మ్యాచ్ల్లో ఆరింట విజయం సాధించింది. టోర్నీలో భాగంగా హైదరాబాద్ తన తదుపరి మ్యాచ్లో ఢిల్లీతో తలపడనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా మే 5న జరగనుంది.