Shubman Gill: భారత వన్డే జట్టు కెప్టెన్గా శుభ్మన్ గిల్ త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ జాతీయ మీడియాలో వార్తలు వస్తుండడం భారత క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది. శ్రీలంక జట్టుతో జరగబోయే వన్డే సిరీస్కు శుభ్మన్ గిల్ కెప్టెన్సీ వహిస్తాడని వార్తలు వస్తున్నాయి. అలాగే గిల్ కు టీ20 వైస్ కెప్టెన్సీని కూడా అప్పగిస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిపై ప్రస్తుత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మతో బీసీసీఐ చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే శుభ్మన్ గిల్ ప్రస్తుతం టీమిండియా టెస్ట్ కెప్టెన్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
టెస్టు క్రికెట్లో రోహిత్ శర్మ ఫామ్ కోల్పోవడంతో అతని టెస్ట్ కెరీర్ ముగియడం అనివార్యమని అంతా భావించారు. ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ప్రదర్శన తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకున్నాడు. కెప్టెన్గా రోహిత్ భారత్కు అనేక గొప్ప విజయాలను అందించినప్పటికీ బ్యాటర్గా టెస్టుల్లో అంత గొప్పగా రాణించలేకపోయాడు. 2027 ప్రపంచ కప్ ను దృష్టిలో ఉంచుకొని రోహిత్, కోహ్లీ వన్డేలలో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. వన్డేలలో రోహిత్ శర్మ అద్భుతమైన రికార్డు కలిగి ఉన్నందున కెప్టెన్గా కొనసాగుతాడని అందరూ ఊహించారు.

అయితే ఒక ప్రముఖ జర్నలిస్ట్ సోషల్ మీడియా వేదికపై చేసిన పోస్ట్ ప్రకారం.. టీమిండియా తదుపరి వన్డే సిరీస్లో శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనున్నట్లు తెలిపారు. టెస్టుల్లో టీమిండియా పగ్గాలు చేపట్టిన గిల్.. రోహిత్ నుంచి వన్డే సారథ్య బాధ్యతలను కూడా తీసుకోనున్నట్లు చెప్పారు. ఈ పోస్ట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది. దీనిపై ప్రస్తుతం నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. దీనికి చాలా మంది మద్దతు తెలపగా.. మరికొందరు ఆశ్చర్యపోయారు.
ఈ లోపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సెప్టెంబర్లో బంగ్లాదేశ్ జట్టుతో జరిగే వన్డే సిరీస్కు తిరిగి రావాల్సి ఉంది. కానీ బీసీసీఐ, బీసీబీ పరస్పర నిర్ణయంతో ఈ సిరీస్ను వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. ఈ సీనియర్ ఆటగాళ్లు నవంబర్లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు తిరిగి వన్డేలలో ఆడనున్నారు. ప్రపంచ కప్కు ముందు భారత్ కొన్ని వన్డేలు మాత్రమే ఆడనుంది. కాబట్టి ఈ స్టార్ ఆటగాళ్లు ఫిట్గా, ఫామ్లో ఉండటం వారికి పెద్ద సవాలుగా మారనుంది.