
చెన్నై: స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ గాయం బారిన పడ్డాడు. చెన్నైలోని చెపాక్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు (సోమవారం) ఆటలో ఫీల్డింగ్ చేస్తుండగా గిల్ ఎడమచేతికి గాయమైంది. గాయం కారణంగా గిల్ మంగళవారం ఆటలో ఫీల్డింగ్కు కూడా రాలేదు. మోచేతికి గాయం కావడంతో ముందు జాగ్రత్తగా స్కానింగ్ కోసం అతన్ని హాస్పిటల్కు తీసుకెళ్లారు.
గాయం కారణంగా శుభ్మన్ గిల్ నాలుగో రోజు కూడా ఫీల్డింగ్కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మెడికల్ టీమ్ అతని గాయం తీవ్రతను పరిశీలిస్తోంది. 'రెండో టెస్టు మూడో రోజు ఫీల్డింగ్ చేస్తుండగా గిల్ ఎడమచేతికి గాయమైంది. ముందు జాగ్రత్తగా స్కానింగ్ కోసం అతన్ని హాస్పిటల్కు తీసుకెళ్లాం. బీసీసీఐ మెడికల్ టీమ్ గాయం తీవ్రతను పరిశీలిస్తోంది. ఈ రోజు గిల్ ఫీల్డింగ్ చేయడు' అని బీసీసీఐ ట్వీట్ చేసింది. దెబ్బ తగిలినప్పుడు గిల్ ఫార్వర్డ్ షార్ట్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు.
రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ డకౌట్ అయినా విషయం తెలిసిందే. ఓలి స్టోన్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో 14 పరుగులు చేసి జాక్ లీక్ బౌలింగ్లో ఎల్బీగా ఔట్ అయ్యాడు. మొదటి టెస్టులో గిల్ రెండు ఇన్నింగ్స్లలోనూ 29, 50 పరుగులు చేశాడు. ఆసీస్ పర్యటనలో అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. బోర్డర్-గవాస్కర్ సిరీస్లో మూడు టెస్టు మ్యాచ్లు ఆడి 51 యావరేజ్తో 259 పరుగులు చేశాడు. గబ్బా టెస్టులో చటేశ్వర్ పుజారా (56)తో కలిసి గిల్ (146 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 91) మంచి పునాది వేశాడు.
నాలుగో రోజు ఆటలో భారత్ విజయానికి ఇంకో నాలుగు వికెట్ల దూరంలో ఉంది. టీమిండియా నిర్దేశించిన 482 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లండ్ ఓవర్ నైట్ స్కోర్ 53/3తో ఆట ఆరంభించిన ఆ జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. ఉదయం క్రీజులోకి వచ్చిన లారెన్స్, రూట్ నిలకడగా ఆడుతున్న క్రమంలో అశ్విన్ వేసిన బౌలింగ్లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో లారెన్స్ (26)ను పంత్ స్టంప్ ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 66 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాలోపడింది. స్టోక్స్ (8), పోప్ (12) కూడా త్వరగానే ఔట్ అయ్యారు. రూట్ మాత్రం క్రీజులో ఉన్నాడు. అక్షర్, అశ్విన్ తలో మూడు వికెట్లు పడగొట్టారు.