జింబాబ్వే పర్యటనను ఘనంగా ముగించిన భారత యువ ఆటగాళ్లు ఐసీసీ టీ20ల్లో ర్యాంకింగ్స్లో సత్తాచాటారు. అయిదు టీ20ల సిరీస్ను జింబాబ్వేపై 4-1తో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలి టీ20లో ఓటమిపాలైనా, తర్వాత గొప్పగా పుంజుకుని విజయాలతో హోరెత్తించింది. భారత క్రికెట్ భవిష్యత్కు భరోసా ఇస్తూ శుభ్మన్ గిల్ నేతృత్వంలోని యువ జట్టు ఆకట్టుకుంది.
అయితే ఈ సిరీస్లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన శుభ్మన్ గిల్ ర్యాంకింగ్స్లో దూసుకెళ్లాడు. అతనితో పాటు యశస్వీ జైస్వాల్ తన ర్యాంక్ను మెరుగుపర్చుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలిచిన వాషింగ్టన్ సుందర్, బంతితో అలరించిన ముకేశ్ కుమార్ కూడా ర్యాంకింగ్స్ ముందుకు వెళ్లారు. జింబాబ్వే సిరీస్లో42 సగటు, 125 స్ట్రైక్రేటుతో 170 పరుగులు చేసిన గిల్ ఏకంగా 36 స్థానాలు ఎగబాకి 37వ స్థానంలో నిలిచాడు.

రోహిత్ శర్మ (42 ర్యాంక్), విరాట్ కోహ్లి (51) ర్యాంక్లను గిల్ అధిగమించాడు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన అనంతరం రోహిత్, కోహ్లి టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు జైస్వాల్ నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్కు చేరుకున్నాడు. ఈ సిరీస్లో జైస్వాల్ సెకండ్ లీడింగ్ రన్ స్కోరర్. 141 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ ఓ స్థానాన్ని కోల్పోయి ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు.
టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-10లో భారత్ నుంచి సూర్య, జైస్వాల్, రుతురాజ్ ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ 797 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అగ్రస్థానంలో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (844 పాయింట్లు) ఉన్నాడు. ఆరు వికెట్లతో సిరీస్లో రాణించిన సుందర్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో 36 స్థానాలు మెరుగుపర్చుకుని 46 స్థానంలో నిలిచాడు. ముకేశ్ కుమార్ 21 స్థానాలు ఎగబాకి 73 ర్యాంక్కు చేరుకున్నాడు.
కాగా, జింబాబ్వే సిరీస్కు దూరమైన అక్షర్ పటేల్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో నాలుగు స్థానాలు కోల్పోయి 13వ ర్యాంక్లో నిలిచాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ టాప్లో కొనసాగుతున్నాడు. ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో హార్దిక్ పాండ్య ఆరో ర్యాంక్కు పడిపోయాడు. జింబాబ్వే పర్యటనకు దూరమైన హార్దిక్ కూడా నాలుగు స్థానాలు కోల్పోయాడు. టాప్లో హసరంగ ఉన్నాడు. జింబాబ్వే కెప్టెన్ ఓ స్థానాన్ని మెరుగుపర్చుకుని మూడో ర్యాంక్కు చేరుకున్నాడు.