
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ చెలరేగాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే మంచి కమాండింగ్గా ఆడిన అతను.. తన కెరీర్లో రెండో టెస్టు సెంచరీ పూర్తిచేసుకున్నాడు. మూడో రోజు ఆట మొదలైన తర్వాత చక్కగా బ్యాటింగ్ చేసిన అతను.. ఎక్కడా పొరపాటు చేయకుండా ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. రోహిత్ శర్మ (35) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. భారత్ తరఫున 17 వేల పరుగులు పూర్తి చేసుకున్న కాసేపటికే పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత ఛటేశ్వర్ పుజారా (42)తో కలిసి గిల్ తన ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.. అదే జోరు కొనసాగించాడు. ఎక్కడా పొరపాటు చేయకుండా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. ఈ క్రమంలోనే తన కెరీర్లో రెండో టెస్టు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు గతేడాది చివర్లో బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీసులో అతను తన తొలి టెస్టు సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఇలా గిల్ సెంచరీ చేయడం చూసిన ఫ్యాన్స్ చాలా సంతోషిస్తున్నారు.
రాహుల్ స్థానంలో గిల్ను తీసుకోవడం ఇందుకే మంచి నిర్ణయం అని అంటున్నారు. రాహుల్ వరుసగా విఫలమైతే.. గిల్ మాత్రం తను ఆడిన మూడో ఇన్నింగ్స్లోనే సెంచరీ చేశాడని మెచ్చుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం ఈ పిచ్ పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలిస్తోందని, ఇక్కడ రాహుల్ అయినా రెచ్చిపోయేవాడని విమర్శలు చేస్తున్నారు. కానీ గిల్ అభిమానులు మాత్రం రాహుల్ కన్నా గిల్ వందరెట్లు బెటర్ అని, ఇలా సెంచరీలు చేసే ఫామ్లో ఉన్నాడు కాబట్టే గిల్ను ఆడించాలని వాదిస్తున్నారు. ఏదేమైనా గిల్ సెంచరీతో భారత జట్టు కూడా ఆసీస్ చేసిన స్కోరుకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది.