టీ20 ప్రపంచ కప్ 2026 కోసం ప్రకటించిన భారత జట్టులో శుభ్మన్ గిల్కు చోటు దక్కకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఈ నిర్ణయంపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా సెలెక్టర్లపై విమర్శలు గుప్పించారు. శుభ్మన్ గిల్ను పక్కన పెట్టడం అనేది సెలెక్టర్లు గతంలో చేసిన తప్పును సరిదిద్ధుకునే ప్రక్రియే తప్ప.. ఓ ధైర్యవంతమైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
టెస్టుల్లో మెరిసినా.. టీ20ల్లో కానరాని జోరు
సంజయ్ మంజ్రేకర్ తన పోస్టులో ముఖ్యంగా 2025 ఇంగ్లాండ్ పర్యటనను ప్రస్తావించారు. ఆ టెస్ట్ సిరీస్లో శుభ్మన్ గిల్ 754 పరుగులు సాధించి అద్భుత ఫామ్ను కనబరిచాడు. అయితే టెస్టుల్లో విజయం సాధించినంత మాత్రాన టీ20 ప్రపంచ కప్లో చోటు దక్కుతుందని భావించడం పొరపాటని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నారు. "ఒక ఫార్మాట్లో రాణించినందుకు మరొక ఫార్మాట్లో అవకాశం ఇవ్వడం ద్వారా సెలెక్టర్లు ఆవేశపడ్డారు. ఇప్పుడు గిల్ను తొలగించడం ద్వారా ఆ పొరపాటును సరిదిద్దుకుంటున్నారు" అని సంజయ్ మంజ్రేకర్ విశ్లేషించారు.

సెలెక్టర్ల వ్యూహం.. పేర్ల కంటే పాత్రలకే ప్రాధాన్యం
భారత జట్టు ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ వివరణ ఇస్తూ.. జట్టులో సమతుల్యత కోసమే శుభ్మన్ గిల్ను పక్కన పెట్టాల్సి వచ్చిందని వెల్లడించారు. జట్టుకు ఓపెనింగ్లో వికెట్ కీపర్ ఆప్షన్ (సంజూ శాంసన్ లేదా ఇషాన్ కిషన్) కావాలని సెలెక్టర్లు భావించారు. శుభ్మన్ గిల్ గత 18 టీ20 ఇన్నింగ్స్ల్లో ఒక్క అర్ధ సెంచరీ కూడా సాధించలేదు. దానికి తోడు గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఓపెనింగ్లో అభిషేక్ శర్మ వంటి దూకుడున్న ఆటగాడు ఉండటంతో గిల్కు చోటు దక్కడం కష్టమైంది.
టీమిండియా మేనేజ్మెంట్ ఇప్పుడు 15 మంది ఉత్తమ ఆటగాళ్లను ఎంచుకోవడం కంటే, జట్టుకు అవసరమైన 15 నిర్దిష్ట పాత్రలను భర్తీ చేయడానికే మొగ్గు చూపుతోందని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నారు. స్టార్ హోదా ఉన్నప్పటికీ, జట్టు వ్యూహానికి సరిపోకపోతే ఎవరినైనా పక్కన పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ ఎంపిక ద్వారా స్పష్టమైందని ఆయన అన్నారు. గిల్ను టీ20ల్లో గతంలో ఎంపిక చేయడమే పొరపాటని, ఇప్పుడు దాన్ని సవరించుకున్నారని మంజ్రేకర్ భావిస్తున్నారు. రింకూ సింగ్ వంటి ఫినిషర్లు, సంజూ వంటి వికెట్ కీపర్-ఓపెనర్లకు ప్రాధాన్యత పెరిగింది. జట్టు నిర్మాణం ముందు స్టార్ హోదా చిన్నబోయింది.