మొహాలి వేదికగా అఫ్గానిస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్లో ఘనంగా బోణీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లకు అయిదు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. మహ్మద్ నబీ (42; 27 బంతుల్లో) టాప్ స్కోరర్. టీమిండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ (2/33), అక్షర్ పటేల్ (2/23), దూబె (1/9) సత్తాచాటారు.
అనంతరం ఛేదనకు దిగిన భారత్ 17.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా సాధించింది. ఆల్రౌండ్ షోతో విజయంలో కీలక పాత్ర పోషించిన శివమ్ దూబె (1/9; 60; 40 బంతుల్లో) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అయితే టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించిన రెండో బంతికే రోహిత్ శర్మ (0) రనౌటయ్యాడు. అనంతరం మైదానాన్ని వీడుతూ గిల్పై రోహిత్ నోరు పారేసుకున్నాడు.

మ్యాచ్ అనంతరం ఈ విషయం గురించి రోహిత్ స్పందిస్తూ.. అసహనంతో కోపంగా మాట్లాడని తెలిపాడు. ఉద్దేశపూర్వకంగా అనలేదని వివరణ ఇచ్చాడు. మరోవైపు కామెంటేటర్స్ ఈ విషయంలో రోహిత్దే తప్పు అని పేర్కొన్నారు. ''గిల్ బంతి వైపు చూస్తున్నాడు. మరోవైపు రోహిత్ పరుగు కోసం ఒకేసారి పిలిచాడు. మరోసారి హెచ్చరించలేదు. ఇది సరైనది కాదు. ఈలోపు రోహిత్ పరుగు దాదాపు పూర్తిచేశాడు''
''అయితే వికెట్ మధ్యలో పరుగు కోసం ప్రయత్నించేటప్పుడు రెండు కీలక విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఒకటి పరుగును మొదలుపెట్టడం, మరొకటి మన భాగస్వామి వేగాన్ని అంచనా వేయడం. అంతేకానీ మనం ఎంత బాగా పరిగెత్తుతున్నామనేది ఇక్కడ కీలకం కాదు. మన పార్టనర్ పరుగు కావాలనుకుంటున్నాడా, వేగంగ ఉన్నాడనేది ముఖ్యం'' అని కామెంటేటర్స్ అన్నారు.
మరోవైపు శుభ్మన్ గిల్కు మద్దతుగా నెట్టింట్లో పోస్ట్లు పెడుతున్నారు. దీంతో గిల్ పేరు ట్రెండింగ్లోకి వచ్చేసింది. అనవసర పరుగు కోసం రోహిత్ ప్రయత్నించాడని, అంతేగాక గిల్ను తిట్టడం మంచి పద్ధతి కాదని కామెంట్లు చేస్తున్నారు. కెప్టెన్ స్థానంలో ఉండి తరుచూ నోరుజారడం సరికాదని అంటున్నారు. కాగా, రోహిత్ ఔటైన తర్వాత గిల్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. 12 బంతుల్లో 23 పరుగులు చేసి ముజీబ్ బౌలింగ్లో స్టంపౌట్ అయ్యాడు. ఇండోర్ వేదికగా ఆదివారం భారత్-అఫ్గానిస్థాన్ రెండో టీ20 ఆడనుంది.