ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో గుజరాత్ టైటాన్స్ జట్టు ఎట్టకేలకు విజయం సాధించి ఖాతా తెరిచింది. ఈ పోరులో కేవలం ఒక్క పరుగుతోనే గుజరాత్ గెలవడం విశేషం. ఈ థ్రిల్లింగ్ విక్టరీ అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తన మనసులోని మాటను పంచుకున్నాడు. తాము ఆడిన గత మూడు మ్యాచ్లు కూడా చివరి ఓవర్ వరకు వెళ్లడం విశేషమని.. అయితే ఈసారి విజేతగా నిలవడం చాలా సంతోషంగా ఉందని శుభ్మన్ గిల్ పేర్కొన్నాడు.
మ్యాచ్ చివరి బంతికి ముందు ప్రసిద్ధ్ కృష్ణతో జరిగిన చర్చ గురించి శుభ్మన్ గిల్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. "చివరి బంతికి యార్కర్ వేయాలా లేక స్లోయర్ డెలివరీ వేయాలా అని మేమిద్దరం చర్చించుకున్నాం. పిచ్ స్వభావాన్ని బట్టి స్లోయర్ బాల్ వేయడమే సరైనదని నిర్ణయించుకున్నాం. ఒకవేళ స్లోయర్ బంతిని కచ్చితత్వంతో వేయగలిగితే.. దానిని బౌండరీ బాదడం బ్యాటర్కు చాలా కష్టమవుతుందని భావించాం" అని గిల్ వివరించాడు.

ఫీల్డింగ్ గురించి మాట్లాడుతూ.. శుభ్మన్ గిల్ కొంత ఆత్మవిమర్శ చేసుకున్నాడు. "ఫీల్డింగ్ పరంగా నేను కొన్ని ఓవర్ త్రోలు, ఒక బౌండరీ ఇచ్చాను. ఇలాంటి ఉత్కంఠభరిత మ్యాచ్ల్లో ఒక్క పరుగు తేడాతో గెలిచినప్పుడు, ప్రతి చిన్న పొరపాటు లేదా ప్రతి మంచి ప్రయత్నం మ్యాచ్ ఫలితంపై పెద్ద ప్రభావాన్నే చూపుతుంది. ఆ 5-6 పరుగులు చాలా కీలకం" అని శుభ్మన్ గిల్ అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ఐదో బంతికి సింగిల్ తీసుకోకపోవడం కూడా తమకు కలిసివచ్చిందని గిల్ గుర్తు చేశాడు.
పిచ్ పరిస్థితులపై గిల్ స్పందిస్తూ.. తాము చేసిన 210 పరుగుల స్కోరు ఈ పిచ్పై పార్ స్కోరు కంటే 10-15 పరుగులు ఎక్కువేనని వెల్లడించాడు. "డెత్ ఓవర్లలో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. పిచ్ నెమ్మదించడం వల్ల పెద్ద షాట్లు కొట్టడం కష్టంగా మారింది. అందుకే మేము క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తే ఖచ్చితంగా గెలుస్తామని నమ్మకంతో ఉన్నాం" అని శుభ్మన్ గిల్ చెప్పాడు. తన బ్యాటింగ్ ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేస్తూ.. రేపటి కోసం సిద్ధమవ్వడానికి ప్రస్తుతానికి విశ్రాంతి అవసరమని నవ్వుతూ ముగించాడు.