IPL 2025 Gujarat Titans: ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేసులో మరో అడుగుముందుకేసింది. అయితే ఈ మ్యాచులో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 22 డాట్ బాల్స్ మాత్రమే ఆడింది గుజరాత్. ఓ ఐపీఎల్ ఇన్నింగ్స్ లో అతి తక్కువ డాట్ బాల్స్ ఆడిన జట్టుగా నిలిచింది. అంతకుముందు సన్ రైజర్స్ జట్టు 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్ పై (22) ఆడింది.
మ్యాచ్ అనంతరం తక్కువ డాట్ బాల్స్ ఆడటం గురించి మాట్లాడాడు కెప్టెన్ శుభ్మన్ గిల్. అలానే ఈ మ్యాచులో తాను థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పు బడుతూ.. ఫోర్త్ అంపైర్పై అసహనం వ్యక్తం చేసిన సందర్భం గురించి కూడా స్పందించాడు. తాను 110 శాతం ఎఫర్ట్ పెట్టి ఆట ఆడినట్లు చెప్పుకొచ్చాడు.

అలా జరిగిపోతాయి అంతే...
"20 ఓవర్లలో కేవలం 22 డాట్ బంతులను మేము ముందుగా ప్లాన్ చేయలేదు. మేం అనుకున్నదొకటే.. ఇప్పటివరకు ఆడుతున్న ఆటనే కొనసాగించాలనేదే. ఈ బ్లాక్ సాయిల్ పిచ్ పై సిక్స్లు కొట్టడం అంత సులభం కాదు. అయినా నేను, సాయి, జోస్ మేమంతా బాగా పరిస్థితిని అర్థం చేసుకుంటూ ఆడాం. స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాం. క్రీజులో ఒకరిద్దరు కచ్చితంగా ఉండాలి అని మేం అనుకోలేదు. మేమందరం పరుగుల ఆకలితో ఉన్న వాళ్ళం. జట్టు విజయం కోసం ఏది చేయాల్సి వస్తే అది చేయడానికే సిద్ధంగా ఉంటాం. ఫీల్డింగ్ విషయంలో మాత్రం మేం ప్రతి మ్యాచ్కు ముందు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇప్పటివరకు అంత గొప్పగా ఫీల్డింగ్ చేయలేకపోయినా, ఈ రోజు మాత్రం మా ఫీల్డింగ్ ప్రదర్శన బాగుంది. ప్రతిఒక్కరూ తమ వంతుగా రాణించారు. ఇటువంటి మైదానాల్లో డిఫెండ్ చేయడానికి ఆప్షన్లు ఉండటం ఉపయోగపడుతుంది. అంపైర్తో నాకు కాస్త చర్చ జరిగింది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం 110 శాతం ఇవ్వాలన్న తాపత్రయంలో ఆడుతాం. అ్పపుడు భావోద్వేగాలు ఇలానే ఎక్కువ అవుతాయి. అలాంటి సందర్భాల్లో ఇలాంటివి జరగడం సహజం." అని గిల్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచులో శుభ్మన్ గిల్ (76; 38 బంతుల్లో 10×4, 2×6), జోస్ బట్లర్ (64; 37 బంతుల్లో 3×4, 4×6), సాయి సుదర్శన్ (48; 23 బంతుల్లో 9×4) రాణించారు. దీంతో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్లకు 224 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో అభిషేక్ శర్మ (74; 41 బంతుల్లో 4×4, 6×6) ఒక్కటే రాణించాడు. ప్రసిద్ధ్ కృష్ణ (2/19), మహ్మద్ సిరాజ్ (2/33) సన్ రైజర్స్ ను దెబ్బ తీశారు.