హైదరాబాద్: ఆటని ఎంజాయ్ చేయాలని భారత యువ క్రికెటర్లు పృథ్వీ షా, శుభమన్ గిల్లకు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సూచించాడు. గతేడాది వెస్టిండిస్ పర్యటనతో పృథ్వీ షా అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేయగా... ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో శుభమన్ గిల్ ఐదు వన్డేల సిరిస్లో అరంగేట్రం చేశాడు.
India vs New Zealand: రెండో టీ20 ప్రివ్యూ: ఎప్పుడు, ఎక్కడ ఎలా వీక్షించాలి!
ఇటీవలే న్యూజిలాండ్తో ముగిసిన ఐదు వన్డేల సిరిస్లో భాగంగా నాలుగు, ఐదు వన్డేల్లో ఆడిన శుభమన్ గిల్ 9, 7 పరుగులతో నిరాశపరిచాడు. దీంతో అభిమానులు అతనిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో శుభమన్ గిల్కు సచిన్ టెండూల్కర్ మద్దతుగా నిలిచాడు.
టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్యూలో సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ "పృథ్వీ షా ఆటతీరు గురించి గతంలోనే నేను మాట్లాడాను. 8-9ఏళ్ల వయసులో అతని ప్రాక్టీస్ చూసి తప్పకుండా భారత్ జట్టుకి ఆడతాడని నాకు అనిపించింది. శుభమన్ గిల్ కూడా అండర్-19 ప్రపంచకప్లో షాతో కలిసి అత్యుత్తమంగా ఆడాడు" అని అన్నాడు.
"ఇద్దరిలోనూ అద్భుతమైన ప్రతిభ ఉంది. ఇటీవలే వారిద్దరూ జాతీయ జట్టులోకి అరంగేట్రం చేశారు కాబట్టి.. కొద్దిరోజులు ఆటని ఆస్వాదించనివ్వండి" అని సచిన్ తెలిపాడు. ఇదిలా ఉంటే, మూడు టీ20ల సిరిస్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం ఉదయం 11.30 గంటలకి రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.