రానున్న టీ20 వరల్డ్ కప్కు మరికొన్ని రోజుల్లో భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. 15 మందితో కూడిన జట్టుతో పాటు అయిదుగురు స్టాండ్బై ప్లేయర్లను ఎంపిక చేయనున్నారని సమాచారం. అయితే రోహిత్ శర్మతో పాటు ఇన్నింగ్స్ ప్రారంభించే మరో ఓపెనర్ స్థానం కోసం యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్ పోటీలో ఉన్నారు.
ఓపెనర్గా విరాట్ కోహ్లిని బరిలోకి దించాలనే వాదన వినిపిస్తోంది. అలాగే సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మను ప్రపంచకప్ జట్టులో పరిగణనలోకి తీసుకోవాలనే డిమాండ్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెగా టోర్నీలో తన స్థానం గురించి గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకోవాలనే ఆలోచనతో గుజరాత్ టైటాన్స్కు ఆడితే అది జట్టుకు అన్యాయం చేసినట్లుగా అవుతుందని గిల్ అన్నాడు.

హార్దిక్ పాండ్య స్థానంలో గుజరాత్ టైటాన్స్ జట్టు బాధ్యతలు అందుకున్న గిల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ''రెండేళ్లు ఫైనల్స్కు చేరిన జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించడం ఆసక్తికరంగా ఉంది. ప్లేయర్గా కాకుండా కెప్టెన్గా జట్టుకు మరింత మేలు చేయాలని చూస్తున్నా. ఇక 'ప్రిన్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్' ట్యాగ్ గురించి మాట్లాడాలంటే దాన్ని నేను పట్టించుకోను. క్రీజులో అడుగుపెట్టే ముందు ప్రిన్స్, గత పది ఇన్నింగ్స్ల్లో నేనేం సాధించా అని గుర్తుకు రావు. తర్వాత బంతినే ఎలా ఎదుర్కోవాలనే ఆలోచిస్తా''
''ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా ఉన్నా. ఈ స్థితిలో టీ20 వరల్డ్ కప్లో నా ఎంపిక గురించి ఆలోచిస్తే గుజరాత్కు అన్యాయం చేసినట్లే. ప్రతి ప్లేయర్కు కెప్టెన్గా నేను 100% మద్దతు ఇవ్వాలి. ప్రస్తుతం జట్టు గురించి ఆలోచించకుండా ఇతర విషయాలు ఆలోచిస్తే నేను మంచి కెప్టెన్ కానట్లే. గత సీజన్లో దాదాపు 900 పరుగులు చేశా. నన్ను ఎంపిక చేయాలనుకుంటే చేస్తారు, లేదంటే లేదు'' అని గిల్ పేర్కొన్నాడు. జూన్ 2వ తేదీ నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.