గత కొన్నిరోజులుగా భారత క్రికెట్లో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. రాహుల్ ద్రవిడ్ స్థానంలో ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు అందుకున్నాడు. మరోవైపు రోహిత్ శర్మ స్థానంలో టీ20లకు హార్దిక్ పాండ్య కెప్టెన్గా ఎంపిక అవుతాడని భావించగా, సూర్యకుమార్ యాదవ్ జట్టు పగ్గాలు అందుకున్నాడు. హార్దిక్కు కనీసం వైస్ కెప్టెన్గా కూడా అవకాశం ఇవ్వలేదు. శుభ్మన్ గిల్ను టీ20, వన్డేలకు వైస్కెప్టెన్గా నియమించారు.
దీంతో గిల్పై చర్చలు మొదలయ్యాయి. పేలవమైన ఫామ్ కారణంగా గిల్ టీ20 వరల్డ్ కప్లో చోటు సాధించలేకపోయాడు. రిజర్వ్ ప్లేయర్గా మాత్రమే ఎంపికయ్యాడు. అంతేగాక టోర్నీ మధ్యలోనే అమెరికా నుంచి భారత్కు తిరిగొచ్చాడు. సీనియర్లు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆ తర్వాత జింబాబ్వే సిరీస్కు స్టాండ్బై కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఆ సిరీస్లో గిల్ రాణించినా.. అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్ సాధించిన స్ట్రెక్రేటుతో పోలిస్తే అతని గణాంకాలు పేలవంగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ప్లేయర్గానే భారత జట్టులో గిల్ ఎంపికే కష్టమనుకుంటే, వైస్ కెప్టెన్గా అతన్ని నియమిండచంపై సెలక్టర్లు, కోచ్లపై విమర్శలు వచ్చాయి. అయితే అంచనాలకు తగ్గట్లుగా తాను ఆడట్లేదని, కానీ వచ్చే టీ20 వరల్డ్ కప్లోపు మెరుగైన ప్లేయర్గా మారుతానని గిల్ పేర్కొన్నాడు. ''వరల్డ్ కప్ ఎంపిక గురించి మాట్లాడాలంటే.. ఊహించినంతంగా నా టీ20 ప్రదర్శన లేదు. కానీ వచ్చే వరల్డ్ కప్కు ముందుగా మేం 30 నుంచి 40 మ్యాచ్లు ఆడతాం. ఈ సమయంలో బ్యాటర్గా మరింత మెరుగవుతాను'' అని గిల్ అన్నాడు.
కెప్టెన్గా ఎంపికైనా బ్యాటర్గా తన బాధ్యతల్లో ఎలాంటి ప్రత్యేక మార్పులు ఉండవని జింబాబ్వే పర్యటనను ఉద్దేశించి గిల్ మాట్లాడాడు. ''ఓ బ్యాటర్గా పెద్దమార్పులేమి ఉండవు. క్రీజులో అడుగుపెట్టిన తర్వాత జట్టు, దేశం కోసం మ్యాచ్లు గెలవాలని ప్రదర్శన చేస్తాను. దీనిలో ఎలాంటి మార్పు ఉండదు. అయితే ఫీల్డింగ్లో కెప్టెన్గా కొన్ని అదనపు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అది మాత్రమే గతం కంటే భిన్నమైనది. ఇక యశస్వీ జైస్వాల్తో ఇన్నింగ్స్ ప్రారంభించడాన్ని ఎంతో ఆస్వాదిస్తా. రైట్-లెఫ్ట్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. మేం ఇద్దరం ఎన్నో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాం'' అని గిల్ పేర్కొన్నాడు.