ముంబై: జట్టుకు విరాట్ కోహ్లీ లాంటి నాయకుడు దొరకడం అదృష్టమని టీమిండియా యువ సంచలనం శుభ్మన్ గిల్ అభిప్రాయపడ్డాడు. సీనియర్ ఆటగాళ్లు ప్రశంసిస్తే ఎంతో ప్రేరణ లభిస్తుందన్నాడు. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ప్రస్తుత లాక్డౌన్ సమయంలో దేహదారుఢ్యం, బ్యాటింగ్ టెక్నిక్పై దృష్టి సారించానని గిల్ తెలిపాడు. శుభ్మన్ గిల్ భారత్ తరఫున రెండు వన్డేలు ఆడి 16 పరుగులు చేసాడు.
టీమిండియా పేస్కు మరో రెండేళ్లు ఎదురేలేదు: బౌలింగ్ కోచ్
ఇటీవల టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు శుభ్మన్ గిల్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయగా.. హిట్మ్యాన్ 'థాంక్యూ ఫ్యూచర్' అని ధన్యవాదాలు తెలియజేశాడు. దీనిపై తాజాగా గిల్ స్పందిస్తూ... 'రోహిత్ శర్మ లాంటి వ్యక్తి అలాగంటే ఎంతో బాగుంటుంది. అయితే ఇవేమీ నన్ను ఒత్తిడిలో పడేయవు. ఎవరైనా నన్ను పొగిడినా, విమర్శించినా ఒత్తిడికి గురవ్వను' అని గిల్ అన్నాడు. 'గిల్కు మంచి బ్యాటింగ్ నైపుణ్యం ఉంది. అతను టీమిండియా ఫ్యూచర్ స్టార్. బ్యాటింగ్లో నిలకడ సాధించగలిగితే.. అతని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దేశవాళీ క్రికెట్లో అతనికి మెరుగైన రికార్డులు ఉన్నాయి. నా అంచనా ప్రకారం త్వరలోనే గిల్కు మళ్లీ భారత్ జట్టులో అవకాశం దక్కుతుంది' అని గతంలో రోహిత్ అన్నాడు.
విరాట్ కోహ్లీ నాయకుడిగా ఉండటం జట్టుకు అదృష్టమని గిల్ పేర్కొన్నాడు. ఒత్తిడి చెందకుండా 100 శాతం రాణించేందుకు కోహ్లీ ప్రోత్సహిస్తాడని వెల్లడించాడు. 'అన్ని రకాలుగా రాణించేందుకు ఆటగాళ్లను కెప్టెన్ ప్రోత్సహించడం జట్టుకు ప్రయోజనకరం. అలాంటప్పుడే మన ఆటలో ఒక్క శాతమూ వృథా కాలేదని సంతృప్తి కలుగుతుంది. మైదానంలో ఉన్నప్పుడు కెప్టెన్ యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తే ఎంతో బాగుంటుంది. ఒత్తిడి చెందకుండా 100 శాతం రాణించేందుకు కోహ్లీ ప్రోత్సహిస్తాడు. కోహ్లీ నాయకుడిగా ఉండటం జట్టుకు అదృష్టం' అని గిల్ పేర్కొన్నాడు.
'రెండు మూడు సార్లు నేను విరాట్ కోహ్లీతో మాట్లాడాను. ఇప్పటి వరకు చేసిందే ఇకముందూ నిలకడగా, నిరంతరం చేయాలని సూచించాడు. నిలకడే అత్యంత కీలకమని వివరించాడు' అని గిల్ చెప్పాడు. ప్రస్తుత లాక్డౌన్లో ఫిట్నెస్, ఆటపై దృష్టి సారించానని టీమిండియా యువ సంచలనం అన్నాడు. ఐపీఎల్ను ఎంతగానో మిస్సవుతున్నానని పేర్కొన్నాడు. ఈసారి ఆటగాళ్లందరూ గతంలో కంటే ఎక్కువ ప్రదర్శన ఇస్తారని, ఎందుకంటే సుదీర్ఘ విరామం తర్వాత ప్రతి ఒక్కరూ తనదైన ముద్ర వేయాలనుకుంటున్నారన్నాడు. నేను భావిస్తున్నామళ్లీ మైదానంలో అడుగుపెట్టగానే సాధన శిబిరాల్లో రెండింతలు కష్టపడాల్సి ఉందని వెల్లడించాడు.
దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న శుభమన్ గిల్కు గతేడాది నుంచి భారత్ జట్టుకు ఎంపికవుతున్నా తుది జట్టులో మాత్రం అవకాశం లభించడం లేదు. వాస్తవానికి గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లోనే గిల్కు ఓపెనర్గా అవకాశం దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా రోహిత్ శర్మ ఓపెనర్గా ఆడటం.. సెంచరీ సాధించడంతో మళ్లీ గిల్కు ఆడే అవకాశం రాలేదు. అయితే ఈ యువ క్రికెటర్ మాత్రం భారత్-ఎ జట్టు, దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నాడు.