టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని ఏళ్ల తరబడి తన భుజాలపై మోసిన స్టార్ పేసర్ మహ్మద్ షమీ ప్రస్తుతం జట్టులో లేకపోవడంపై పెద్ద చర్చ జరుగుతోంది. రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున అద్భుతంగా రాణించినప్పటికీ.. షమీకి భారత టెస్ట్ జట్టులో చోటు దక్కలేదు. ఈ అంశంపై దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్కు ముందు కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పందించాడు. మహ్మద్ షమీ సామర్థ్యాన్ని జట్టు యాజమాన్యం గౌరవిస్తున్నప్పటికీ.. యువ పేసర్ల ఇటీవల ప్రదర్శనను విస్మరించలేమని గిల్ స్పష్టం చేశాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్స్ దిశగా కీలక సిరీస్
భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ నవంబర్ 14 నుంచి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2025-27 పాయింట్ల పట్టికలో భారత్ తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి ఈ సిరీస్ అత్యంత కీలకం. కోల్కతా టెస్ట్కు ముందు జరిగిన మీడియా సమావేశంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ.. "డబ్ల్యూటీసీ ఫైనల్స్కు చేరడానికి ఈ టెస్ట్ మ్యాచ్లు చాలా కీలకం. దక్షిణాఫ్రికా చాలా బలమైన ఛాంపియన్ జట్టు. ఆస్ట్రేలియాపై ఆడిన తర్వాత వెంటనే రెడ్ బాల్ క్రికెట్కు మారడం శారీరకంగా, మానసికంగా కష్టమే అయినా, ప్రొఫెషనల్గా దాన్ని ఎదుర్కోవాలి," అని అన్నాడు.

షమీ లేకపోవడంపై గిల్ వ్యూహం
అనుభవజ్ఞుడైన మహ్మద్ షమీ లేకపోవడంపై ప్రశ్నించగా.. గిల్ చాలా వ్యూహాత్మకంగా సమాధానం ఇచ్చాడు. "షమీ భాయ్ లాంటి బౌలర్లు చాలా అరుదుగా ఉంటారు. కానీ మేము ప్రస్తుతం జట్టులో ఉన్న ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, బుమ్రా, సిరాజ్ వంటి ఆటగాళ్ల ఇటీవల అద్భుత ప్రదర్శనను విస్మరించలేము." అని అన్నాడు. ఈ కామెంట్స్తో జట్టు యాజమాన్యం షమీ స్థానంలో యువ పేసర్లు ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణపై పూర్తి విశ్వాసం ఉంచిందని స్పష్టమవుతోంది. షమీ ఎంపిక గురించి తుది నిర్ణయం సెలెక్టర్లదే అని చెబుతూనే, గిల్ తన నలుగురు పేసర్ల బృందంపై పూర్తి నమ్మకాన్ని ప్రదర్శించాడు.
కెప్టెన్గా కోల్కతాలో అడుగు పెట్టడంపై శుభ్మన్ గిల్ తన భావోద్వేగాలను పంచుకున్నాడు."కోల్కతా నగరం నాకు చాలా ప్రత్యేకమైనది, నా ఐపీఎల్ కెరీర్ ఇక్కడే మొదలైంది. ఈ నగరం పంజాబ్ లాగే అనిపిస్తుంది. గతంలో పింక్ బాల్ టెస్ట్కు జట్టులో ఉన్నా ఆడలేదు. ఇప్పుడు కెప్టెన్గా ఇక్కడ ఆడటం చాలా ప్రత్యేకమైన అనుభూతి" అని గిల్ చెప్పాడు.కెప్టెన్సీ సమయంలో తన బలంపై నమ్మకం ఉంచుతానని, జట్టు కూర్పు విషయంలో అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకుంటానని తెలిపాడు.
పిచ్ అంచనా: ఈడెన్ గార్డెన్స్ వికెట్ సాధారణ భారత పిచ్లా ఉందని, సాయంత్రం వేళ వెలుతురు తగ్గే సమయాల్లో ఫాస్ట్ బౌలర్లకు సహాయం లభించినప్పటికీ, భారత పరిస్థితుల్లో స్పిన్నర్లే ఆట ఫలితాన్ని నిర్ణయిస్తారు అని గిల్ అంచనా వేశాడు. గిల్ జట్టులోని నాణ్యమైన ఆల్రౌండర్ల బలం గురించి నమ్మకంగా మాట్లాడాడు. అయితే అదనపు ఆల్రౌండర్ లేదా అదనపు స్పిన్నర్ (అక్షర్ పటేల్ లేదా కుల్దీప్ యాదవ్) ఎంపిక అనేది ఒక సవాలుతో కూడుకున్నదని అంగీకరించాడు. "నేను ఇప్పుడిప్పుడే కెప్టెన్గా ఇవన్నీ నేర్చుకుంటున్నాను," అని గిల్ వ్యాఖ్యానించడం గమనార్హం.