గత కొన్నిరోజులుగా భారత క్రికెట్లో పెనుమార్పులు సంభవిస్తున్న విషయం తెలిసిందే. రాహుల్ ద్రవిడ్ స్థానంలో ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు అందుకున్నాడు. మరోవైపు రోహిత్ శర్మ స్థానంలో టీ20లకు హార్దిక్ పాండ్య కెప్టెన్గా ఎంపిక అవుతాడని భావించగా, సూర్యకుమార్ యాదవ్ జట్టు పగ్గాలు అందుకున్నాడు. హార్దిక్కు కనీసం వైస్ కెప్టెన్గా కూడా బాధ్యతలు ఇవ్వలేదు.
టీ20, వన్డేలకు శుభ్మన్ గిల్ను వైస్కెప్టెన్గా నియమించారు. టీ20 వరల్డ్ కప్ ముందు వరకు కెప్టెన్సీ రేసులో అసలు గిల్ పేరు వినిపించలేదు. కానీ పొట్టి కప్ అనంతరం జరిగిన జింబాబ్వే సిరీస్కు గిల్ స్టాండ్ బై కెప్టెన్గా ఎంపికయ్యాడు. సీనియర్లు, ప్రపంచకప్ విజేత జట్టుకు విశ్రాంతి ఇవ్వడంతో గిల్ సారథిగా ఎంపికయ్యారని భావించారంతా. కానీ భారత జట్టు కెప్టెన్సీలో అనూహ్య మార్పులు రానున్నాయని శ్రీలంక పర్యటనకు భారత జట్టును ఎంపిక చేసిన తర్వాత తెలిసిందే.

మూడు ఫార్మాట్లు ఆడే గిల్కు సారథి బాధ్యతలపై అనుభవం రావాలనే ఉద్దేశంతో నియమించామని సెలక్టర్లు వివరించారు. అయితే టెస్టుల్లో వైస్ కెప్టెన్గా ఉన్న జస్ప్రీత్ బుమ్రా స్థానంలోనూ గిల్కే బాధ్యతలు అందివ్వనున్నట్లు తెలుస్తోంది. స్వదేశంలో సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో ఆడే సిరీస్తో గిల్ సుదీర్ఘ ఫార్మాట్లో వైస్ కెప్టెన్గానూ ఛార్జ్ తీసుకోనున్నాడు. దీంతో మూడు ఫార్మాట్లలోనూ వైస్ కెప్టెన్గా గిల్ ఎంపికకానున్నాడు.
ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో కెప్టెన్సీపై తనకి ఉన్న ఇష్టాన్ని బుమ్రా బయటపెట్టాడు. కెప్టెన్గా బాధ్యతలు అందుకోవడం తనకి ఇష్టమేనని సంకేతాలు ఇచ్చాడు. ఆటను ఫాస్ట్ బౌలర్ కంటే గొప్పగా మరెవరూ అర్థం చేసుకోలేరని, పేసర్ కెప్టెన్గా ఉంటే మంచి ఫలితాలు వస్తాయని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటలకే టెస్టుల్లోనూ గిల్ వైస్ కెప్టెన్ అంటూ జాతీయ మీడియాలో వార్తలు రావడం గమనార్హం.
కాగా, ఇవాళ నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటనకు బుమ్రా విశ్రాంతి తీసుకున్నాడు. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్తో మొదలయ్యే రెండు టెస్టుల సిరీస్కు బుమ్రా తిరిగొస్తాడు. అక్టోబర్లో స్వదేశంలో న్యూజిలాండ్తో భారత్ మూడు టెస్టులు ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో అయిదు టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో లంక సిరీస్కు బుమ్రాకు రెస్ట్ ఇచ్చారు.