ఏకైక భారత బ్యాటర్గా శుభ్మాన్ గిల్ రికార్డు..! తొలి సెంచరీని నాన్నకు అంకితం చేసిన పుత్రరత్నం

భారత స్టార్ బ్యాటర్ శుభ్మాన్ గిల్ జింబాబ్వేపై తన తొలి వన్డే ఇంటర్నేషనల్ సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. ఈ సెంచరీ విషయమై అతను తన ఇన్స్టాలో, ట్విట్టర్ అకౌంట్లలో చాలా ఆనందంగా ఉందని స్పందించాడు. ఇక జింబాబ్వేపై కెరీర్ తొలి సెంచరీ సాధించిన నాలుగో ఇండియన్ బ్యాటర్గా శుభ్మాన్ గిల్ నిలిచాడు. అంతకుముందు రోహిత్ శర్మ, కేదార్ జాదవ్, కేఎల్ రాహుల్ జింబాబ్వేపైనే తమ తొలి సెంచరీ నెలకొల్పారు. మూడో వన్డేలో వన్డౌన్లో దిగిన శుభ్మాన్ గిల్ 82బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. గిల్ (130పరుగులు 97బంతుల్లో 15ఫోర్లు, 1సిక్సర్) తన క్లాసిక్ షాట్లతో అలరించాడు. మిగతా బ్యాటర్లు జిడ్డుగా ఆడుతుంటే అతను మాత్రం జింబాబ్వే బౌలర్లపై ప్రతాపం కొనసాగించాడు. అతను ఆ స్థాయిలో ఆడబట్టి భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 289పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును, అలాగే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా శుభ్ మాన్ గిల్ సాధించాడు.
అద్భుత క్యాచ్ పట్టిన గిల్
ఇక ఛేదనలో జింబాబ్వే ఏం తక్కువ తినలేదు. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సికందర్ రజా (115పరుగులు 95బంతుల్లో 9ఫోర్లు, 3సిక్సర్లు) సెంచరీతో అసామాన్య రీతిలో ఒంటరి పోరాటం చేశాడు. అతను కడవరకు నిలిచి ఉంటే జింబాబ్వేకు విజయాన్ని అందించేవాడేమో. కానీ అతను లాంగాఫ్లో ఓ షాట్ కొట్టగా.. బౌండరీ వద్ద ఉన్న గిల్ పరిగెత్తుకుంటూ వచ్చి అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఆ క్యాచ్ వల్లే చివర్లో ఇండియాకు మ్యాచ్ దక్కిందని చెప్పొచ్చు. ఎందుకంటే రజా అప్పటికే మంచి టచ్లో ఉన్నాడు. ఇక రజా ఔటయ్యాక.. జింబాబ్వే 13పరుగుల తేడాతో ఓడిపోయింది. బ్యాటింగ్లో, ఫీల్డింగ్లో రెండు సార్లు మ్యాచ్ గెలిపించేలా గిల్ తన ప్రదర్శన చేశాడు.
డాట్ బాల్స్ పర్సంటేజీని తగ్గించుకుంటా
ఈ సిరీస్లో మూడు మ్యాచ్ల్లో గిల్ 245పరుగులు చేశాడు. తద్వారా అతనికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. తన బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ.. 'నేను నా డాట్ బాల్స్ పర్సంటేజీని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాను. నేను వీలైనంత వరకు గ్యాప్లలో కొట్టడానికి చూశాను. బ్యాటింగ్కు దిగినప్పుడు జింబాబ్వే బౌలర్లలో ఇద్దరు బౌలర్లు కాస్త మంచిగా బౌలింగ్ చేస్తున్నట్లు గమనించాను. వాళ్ల బౌలింగ్లో కాస్త నిదానంగా ఆడాను. ఇక నేను నిలదొక్కుకున్నాక నేను ఎటాకింగ్ గేమ్ ఆడగలనని తెలుసు. అందుకే 50 దాటాక ఆ పని చేశాను. ఏదేమైనా ఈ అవార్డు, ఈ ప్రదర్శన గొప్పగా అనిపిస్తుంది. మా జట్టు మంచి ప్లేయర్లతో కూడి ఉంది.' అని గిల్ పేర్కొన్నాడు.
నాన్నకు ప్రేమతో..
ఇక తన తొలి సెంచరీని గిల్ తన నాన్నగారికి అంకితమిస్తున్నట్లు పేర్కొన్నాడు. 'మా నాన్న నా ప్రైమరీ కోచ్. నేను రెండో వన్డేలో ఔట్ అయ్యాక మా నాన్న నాతో చాలా సేపు మాట్లాడాడు. బేటా నువ్వు చేసిన మిస్టేక్స్ ఇవి.. సరిదిద్దుకో అంటూ చెప్పారు. అది నాకు ఉపయోగపడింది. కాబట్టి ఈ సెంచరీని మా నాన్నకే అంకితం చేస్తున్నాను.' అని గిల్ పేర్కొన్నారు. గిల్ నాన్నగారి పేరు లక్విందర్ సింగ్. భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా గిల్ ప్రదర్శనను మెచ్చుకున్నాడు. కంటికి ఇంపైనా ఇన్నింగ్స్ ఇది అంటూ అభివర్ణించాడు.
తొలి భారత ప్లేయర్గా రికార్డు
ఇక శుభ్ మాన్ గిల్ తాజా వన్డే సిరీస్ అనంతరం మరో అరుదైన ఘనత సాధించాడు. 22ఏళ్ల వయసులో విదేశాల్లో జరిగిన రెండు వన్డే సిరీస్లలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్లు అందుకున్న తొలి మరియు ఏకైక భారతీయ బ్యాటర్గా రికార్డ్ నెలకొల్పాడు. ఇక ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో అతను మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. శుభ్మాన్ గిల్ లాంటి ప్లేయర్లు ప్రస్తుతం ఆడుతున్నవారిలో కేవలం నలుగురైదుగురు మాత్రమే ఉన్నారంటూ ఇటీవల పాకిస్థాన్ మాజీ ప్లేయర్ సల్మాన్ భట్ కూడా పేర్కొన్నాడు. టైమింగ్, టచ్, క్లాసిక్ షాట్లు ఆడడంతో గిల్ దిట్ట అని అతను అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications