టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ మరో మైలురాయిని చేరుకున్నాడు. సెప్టెంబర్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందుకున్నడు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి స్వయంగా ప్రకటించింది.
సెప్టెంబర్లో జరిగిన ఆసియాకప్ టోర్నీతో పాటు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లోనూ శుభ్మన్ గిల్ అదరగొట్టాడు. పరుగుల వరద పారిస్తూ సెంచరీల మోత మోగించాడు. ముఖ్యంగా ఆసియా కప్లో ఆడిన 5 మ్యాచ్ల్లో ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు బాదిన గిల్.. 75 సగటుతో 302 పరుగులు చేశాడు.

ఇక ఆస్ట్రేలియాతో జరిగిన 3 వన్డేల సిరీస్లో 2 మ్యాచ్ల్లో మాత్రమే ఆడిన గిల్.. తొలి మ్యాచ్లో అర్థసెంచరీ, రెండో మ్యాచ్లో సెంచరీతో అదరగొట్టాడు. ఇలా వరుస సెంచరీలు, అర్థసెంచరీలతో మెరిసిన గిల్ను సెప్టెంబర్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ప్రకటించింది ఐసీసీ.
కాగా.. ఈ ఏడాది జనవరిలో కూడా గిల్కు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు దక్కింది. దీంతో రెండుసార్లు ఈ అవార్డును దక్కించుకున్న తొలి భారత ఆటగాడిగా గిల్ రికార్డు సృష్టించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం డెంగ్యూతో బాధపడుతున్న శుభ్మన్ గిల్.. ఐసీసీ వన్డే వరల్డ్ తొలి రెండు మ్యాచ్లకూ దూరమయ్యాడు.
అలాగే శనివారం నరేంద్రమోదీ స్టేడియం వేదికగా పాకిస్తాన్తో జరగబోతున్న మ్యాచ్లో కూడా గిల్ ఆడడం అనుమానమే. అయితే డెంగ్యూ నుంచి వేగంగా కోలుకుంటున్న గిల్.. గురువారం అహ్మదాబాద్ చేరుకుని కొద్ది సేపు నెట్స్లో ప్రాక్టీస్ కూడా చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరలయ్యాయి.
ఒకవేళ పాక్తో జరగబోతున్న మ్యాచ్లో గిల్ ఆడగలిగితే అది టీమిండియాకు కచ్చితంగా కలిసొస్తుంది. అయితే మ్యాచ్ నాటికి గిల్ పూర్తి ఫిట్నెస్ సాధించగలడా..? లేదా..? అనేదే ఇప్పుడు ఆందోళనకరంగా మారింది.