
బ్రిస్బేన్: బోర్డర్-గవాస్కర్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా పట్టు బిగించింది. ఐదవ రోజు లంచ్ బ్రేక్ సమయానికి 38 ఓవర్లలలో ఒక వికెట్ నష్టానికి 83 పరుగులు చేసి విజయం దిశగా దూసుకెళుతోంది. మొదటి సెషన్లో 36.1 ఓవర్లు ఆడి ఒక వికెట్ కోల్పోయి 79 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ (64), చేటేశ్వర్ పుజారా (8) క్రీజులో ఉన్నారు. భారత్ విజయం సాధించాలంటే ఇంకా 245 పరుగులు చేయాలి. మరో రెండు సెషన్ల ఆట మిగిలి ఉంది.
4/0 ఓవర్నైట్ స్కోర్తో మంగళవారం చివరి రోజు ఆట ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (7) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. పాట్ కమిన్స్ బౌలింగ్లో రోహిత్ కీపర్కు చిక్కాడు. దీంతో జట్టు స్కోరు 18 పరుగుల వద్ద రోహిత్ తొలి వికెట్గా వెనుదిరిగాడు. హిట్మ్యాన్ ఓవర్నైట్ స్కోరు (4)కు కేవలం మూడు పరుగులే జోడించాడు. రోహిత్ ఆదిలోనే పెవిలియన్ చేరినా.. మరో ఓపెనర్ శుభ్మన గిల్ మాత్రం దూకుడుగా ఆడుతున్నాడు.
గిల్ చెత్త బంతులను బౌండరీలు బాదుతూ.. సింగిల్స్, డబుల్స్ తీస్తున్నాడు. ఈ క్రమంలోనే 90 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. జోష్ హాజిల్వుడ్ వేసిన 29వ ఓవర్ మొదటి బంటికి రెండు పరుగులు తీసి హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. అనంతరం ఓ భారీ సిక్స్ కూడా బాదాడు. మరోవైపు చేటేశ్వర్ పుజారా క్రీజులో పాతుకుపోయాడు. అయితే వేగంగా పరుగులు మాత్రం చెయ్యట్లేదు. 90 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పటికీ ఒక్క బౌండరీ కూడా బాధలేదు.
భారత్ విజయానికి ఇంకా రెండు సెషన్లలో 245 పరుగులు చేయాలి. రెండో సెషన్లో భారత ఆటగాళ్లు కాస్త దూకుడు పెంచితే స్కోర్ వేగం పెరుగుతుంది. గిల్, పుజారా ధాటిగా ఆడితే.. నాలుగో స్థానంలో రిషబ్ పంత్ వచ్చే అవకాశం ఉంది. వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ కూడా హిట్టింగ్ చేయగలరు కాబట్టి భారత్ విజయం సాధించే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.