
హైదరాబాద్: టీమిండియా యువ ఆటగాడు శుభమాన్ గిల్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పదేళ్ల రికార్డుని ఇప్పుడు శుభమాన్ గిల్ బద్దలు కొట్టాడు. అతి తక్కువ వయసులో దేవధర్ ట్రోఫీ ఫైనల్లో ఒక జట్టుకు నాయకత్వం వహించిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.
ప్రస్తుతం 47వ దేవధర్ ట్రోఫీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ట్రోఫీలో భాగంగా రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో సోమవారం ఇండియా-సి, ఇండియా-బి జట్లు ఫైనల్లో తలపడ్డాయి. ఇండియా-సి జట్టుకు శుభమాన్ గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం గిల్ వయసు 20 ఏళ్ల 57 రోజులు.
దీంతో దేవధర్ ట్రోఫీ ఫైనల్లో ఓ జట్టుకు నాయకత్వం వహించిన పిన్న వయస్కుడిగా నిలిచాడు. అంతకముందు 2009-10లో నార్త్జోన్కు కెప్టెన్గా వ్వవహారించిన విరాట్ కోహ్లీ (21 ఏళ్ల 142 రోజులు) పేరిట ఈ రికార్డు ఉండేది. ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న గిల్ ఈ మ్యాచ్లో ఒక పరుగుకే పెవిలియన్కు చేరాడు.
దేవధర్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఏతో జరిగిన తొలి మ్యాచ్లో గిల్ సెంచరీతో (143) చెలరేగాడు. ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్కు గిల్ ఎంపికైనప్పటికీ తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా-బి జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేసింది.
ఇండియా-బి జట్టులో కేదార్ జాదవ్ 86 పరుగులతో టాస్ స్కోరర్గా నిలిచాడు. ఇక, ఇండియా-సి బౌలర్లలో ఇషాన్ పోరెల్ 10 ఓవర్లు వేసి 5 వికెట్లు తీసి 43 పరుగులిచ్చాడు. లిస్ట్-ఎ క్రికెట్లో ఇషాన్ పోరెల్కు ఇది రెండో ఐదు వికెట్లు హాల్ కావడం విశేషం.