క్రికెట్ ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేయడానికి మరో సిరీస్ సిద్ధమైంది. ఇవాళ నుంచి జింబాబ్వేతో భారత్ అయిదు టీ20 సిరీస్ ఆడనుంది. శుభ్మన్ గిల్ నేతృత్వంలోని యువ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. హరారే వేదికగా శనివారం సాయంత్రం 4.30 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ భారత క్రికెట్లో కొత్త తరానికి నాంది పలకనుంది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించడం, సీనియర్లంతా దూరమవ్వడంతో యువ ఆటగాళ్లు జింబాబ్వే పర్యటనకు వెళ్లారు. భారత భవిష్యత్ క్రికెట్ను ఈ యువ ఆటగాళ్లే ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి సమవుజ్జీ కానప్పటికీ సిరీస్పై ఆసక్తి పెరిగింది. ఈ సిరీస్తో ఐపీఎల్ స్టార్లు భారత తరఫున అరంగేట్రం చేయనున్నారు. అయితే జట్టుకూర్పు ఎలా ఉంటుందని అందరిలో ఆసక్తి పెరిగింది.

రోహిత్, కోహ్లి, జడేజా స్థానాలను భర్తీ చేసే యువ ఆటగాళ్లు ఎవరనే ఉత్కంఠ మొదలైంది. అయితే మీడియా సమావేశంలో పాల్గొన్న టీమిండియా నయా కెప్టెన్ గిల్ జట్టు కూర్పు గురించి వివరించాడు. తాను ఓపెనర్గా వస్తానాని తెలిపాడు. తనతో పాటు అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని చెప్పాడు. గత కొన్నాళ్లుగా భారత తరఫున టీ20ల్లో రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ను ఆరంభించాడు. కానీ రుతురాజ్కు బదులుగా తన చిన్ననాటి స్నేహితుడు అభిషేక్కు ఓపెనర్గా ఛాన్స్ ఇచ్చాడు.
అయితే రుతురాజ్ మూడో స్థానంలో బ్యాటింగ్కు వస్తాడని గిల్ చెప్పాడు. ''నాతో కలిసి అభిషేక్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. టీ20 వరల్డ్ కప్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఓపెనర్లుగా వచ్చారు. నేను కూడా ఓపెనర్గానే రావాలనుకుంటున్నా. జట్టులో మొత్తం యువ ఆటగాళ్లే ఉండటం ఉత్సాహంగా ఉంది. ప్లేయర్లు అరంగేట్రం చేసి సత్తాచాటుతుంటే ఎంతో బాగుంటుంది''

''టీ20 వరల్డ్ కప్ ఆడిన టీమిండియాతో పోలిస్తే ఈ జట్టు పూర్తి భిన్నంగా ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో అనుభవం సాధించడమే మా ప్రాధాన్యత. ఈ జట్టులో ఎక్కువ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లు ఎవరూ లేరు. కొందరు అరంగేట్రం కూడా చేయలేదు. కాబట్టి ఈ సిరీస్ లక్ష్యం మా ప్రదర్శన చేస్తూ అనుభవం సంపాదించడమే'' అని గిల్ పేర్కొన్నాడు.
జింబాబ్వే పర్యటనకు ఎంపికైన భారత జట్టు:
శుభ్మన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్, జితేశ్ శర్మ, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, సాయి సుదర్శన్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్పాండే.