స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సాధించిన ఘనతలు తాను అందుకోవడం చాలా కష్టతరమని టీమిండియా స్టాండ్బై కెప్టెన్ శుభ్మన్ గిల్ అన్నాడు. అలా ప్రయత్నించినా తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపాడు. టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కని గిల్ జింబాబ్వే పర్యటనలో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు కెప్టెన్గా ఎంపికైన విషయం తెలిసిందే.
జింబాబ్వేతో భారత్ అయిదు టీ20 సిరీస్ ఆడనుంది. హరారే వేదికగా శనివారం సాయంత్రం 4.30 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో పాల్గొన్న నయా కెప్టెన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ''అంచనాలు, ఒత్తిడి ఎప్పుడూ ఉంటాయి. కానీ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సాధించిన ఘనతలు అందుకోవాలని నేను ప్రయత్నిస్తే అది నాకు అత్యంత కష్టతరమే. ప్రతి ప్లేయర్ తమ లక్ష్యాన్ని అందుకునే క్రమంలో ఒత్తిడికి గురవుతుంటాడు''

''అయితే ఇతర ఆటగాళ్లు సాధించిన వాటిని అందుకోవాలని ప్రయత్నిస్తే అతడు తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. కోహ్లి, రోహిత్ భారత క్రికెట్ దిగ్గజాలు. దేశం కోసం వాళ్లు ఎన్నో సాధించారు. అయితే ఆటగాళ్లుగా, జట్టుగా లక్ష్యాలను సాధించే క్రమంలో ఒత్తిడి తప్పక ఉంటుంది. దాన్ని అధిగమిస్తూ రాణించాలి'' అని శుభ్మన్ గిల్ అన్నాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించడం, సీనియర్లంతా దూరమవ్వడంతో యువ ఆటగాళ్లు జింబాబ్వే పర్యటనకు వెళ్లారు. భారత భవిష్యత్ క్రికెట్ను ఈ యువ ఆటగాళ్లే ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి సమవుజ్జీ కానప్పటికీ సిరీస్పై ఆసక్తి పెరిగింది. రోహిత్, కోహ్లి, జడేజా స్థానాలను భర్తీ చేసే యువ ఆటగాళ్లు ఎవరనే ఉత్కంఠ మొదలైంది.
జింబాబ్వే పర్యటనకు ఎంపికైన భారత జట్టు:
శుభ్మన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్, జితేశ్ శర్మ, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, సాయి సుదర్శన్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్పాండే.