గత రెండు మూడు రోజులుగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల అంశం గురించి క్రికెట్ వర్గాల్లో తెగ చర్చ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా గతేడాది కాంట్రాక్టులు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కు ఈసారి కచ్చితంగా అవకాశం దక్కుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఆ గుడ్ న్యూస్ ఏంటంటే?
మార్చి 29న బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. ఈ సెంట్రల్ కాంట్రక్ట్ విషయమై చర్చించుకునేందుకు సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఏ ఆటగాడికి ఏ కాంట్రాక్ట్ ఇవ్వాలనేది నిర్ణయించనున్నారని తెలిసింది. ఇటీవలే మహిళా క్రికెటర్ల కాంట్రాక్ట్ జాబితా వివరాలను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.

అతడికి కన్ఫామ్..
అయితే ఇప్పుడు ప్రధానంగా గతేడాది సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ గురించే చర్చించనున్నారట. వాస్తవానికి ఇప్పటికే వీరి గురించి చర్చించి ఓ నిర్ణయానికి కూడా వచ్చారని తెలిసిందే. శ్రేయస్ కు కచ్చితంగా ఇవ్వనున్నారని తాజాగా ఓ బీసీసీఐ ప్రతినిథి మరోసారి కన్ఫామ్ చేశారు. ఇషాన్ కిషన్ గురించి ఇంకా చర్చలు కొనసాగిస్తున్నారని తెలిపారు. శ్రేయస్ మళ్లీ కాంట్రాక్ట్ పొందనున్నాడు. అతడు ఈ సారి టాప్ కేటగిరిలో ఉంటాడు. ఇషాన్ కిషన్ విషయంలో మాత్రం చర్చలు కొనసాగుతున్నాయి అని సదరు ప్రతినిధి పేర్కొన్నారు.
అందుకే ఇస్తున్నారు...
ఇటీవలే ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో తన సమయోచిత బ్యాటింగ్తో టీమిండియా విజయాల్లో కీలకంగా వ్యవహరించాడు. ఐదు మ్యాచుల్లో 48.60తో 243 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఐపీఎల్ లోనూ రీసెంట్ గా జరిగిన మ్యాచులో 97 నాటౌట్ అదరగొట్టాడు. ఇషాన్ కిషన్ కూడా ఇటీవలే జరిగిన ఐపీఎల్ మ్యాచులో రాజస్థాన్ పై సన్ రైజర్స్ తరఫున ఆడి మెరుపు సెంచరీ చేశాడు. 47 బంతుల్లోనే 106 నాటౌట్ రన్స్ సాధించాడు.
అతడికి ప్రమోషన్...
ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ , రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా A+ కేటగిరినే మళ్లీ దక్కించుకోనున్నారని తాజా సమాచారం. అక్సర్ పటేల్ కు ప్రమోషన్ ఇవ్వనున్నారు. వరుణ్, అభిషేక్, నితీశ్ కు తొలి సారి కాంట్రాక్ట్ ఇవ్వనున్నారు. పూర్తి వివరాలను మార్చి 29న తెలిసే అవకాశం ఉంది.