ఐపీఎల్ మెగా వేలం తేదీలు ఖరారు కావడంతో క్రికెట్ హీట్ మొదలైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో మెగా ఆక్షన్ను నిర్వహించనున్నట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. విదేశాల్లో ఐపీఎల్ వేలాన్ని నిర్వహించడం వరుసగా ఇది రెండోసారి. వేలానికి 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 1165 మంది భారత క్రికెటర్లు ఉండగా, 409 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు.
కోల్కతా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వస్తున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్లో కేకేఆర్ను శ్రేయస్ ఛాంపియన్గా నిలబెట్టిన విషయం తెలిసిందే. గాయం కారణంగా 2023 సీజన్కు దూరమైన శ్రేయస్ ఈ సీజన్లో 39 సగటుతో 351 పరుగులు చేశాడు. అయితే విజతేగా జట్టును గొప్పగా నడిపించిన సారథిని కేకేఆర్ ఫ్రాంచైజీ వదులుకుంది. రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రూ రసెల్, అన్క్యాప్డ్ ప్లేయర్లు హర్షిత్ రాణా, రమణ్దీప్ సింగ్లను రిటైన్ చేసుకుంది.

ఈ ఆటగాళ్ల కోసం తమ పర్స్వ్యాల్యూలోని రూ. 120 కోట్లలో కేకేఆర్ రూ.69 కోట్లు వెచ్చించింది. మిగిలిన రూ.51 కోట్లతో 19 మంది ప్లేయర్ల కోసం మెగా వేలంలోకి బరిలోకి దిగుతోంది. అయితే కేకేఆర్ వదులుకున్న కసితో శ్రేయస్ పరుగులు వరద పారిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో ఒడిస్సాతో జరుగుతున్న మ్యాచ్లో వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తున్నాడు. 14 ఫోర్లు, రెండు సిక్సర్లతో 101 బంతుల్లో శతకాన్ని బాదాడు. రంజీ ట్రోఫీలో శ్రేయస్కు ఇది వరుసగా రెండో సెంచరీ.
మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్లోనూ శ్రేయస్ శతకంతో విరుచుకుపడ్డాడు. శ్రేయస్ అయ్యర్తో పాటు సిద్దేశ్ కూడా సెంచరీ చేయడంతో ముంబై మూడు వికెట్లకు 333 పరుగులతో పటిష్టస్థితిలో నిలిచింది. అయితే శ్రేయస్ అయ్యర్ను దక్కించుకోవడానికి కొన్ని ఫ్రాంచైజీలు ఎంతో ఆసక్తితో ఉన్నాయి. వాటిలో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఉంది. గతంలో ఢిల్లీకి శ్రేయస్ ప్రాతినిథ్యం వహించాడు. జట్టును ఫైనల్స్కు చేర్చాడు. అయితే శ్రేయస్ కోసం ఢిల్లీతో పాటు పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తీవ్రంగా పోటీ పడే అవకాశం ఉంది. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ దక్కని స్థితిలో శ్రేయస్ కోసం ఆర్సీబీ కూడా భారీ మొత్తాన్ని వెచ్చించే ఛాన్స్ఉంది.