
హైదరాబాద్: భారత యువ స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ ప్రముఖ భారత టైర్ తయారీ సంస్థ సియాట్తో బ్యాట్ ఎండార్స్మెంట్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇక నుంచి అన్ని ఫార్మాట్లలో శ్రేయాస్ అయ్యర్ క్రికెట్ బ్యాట్పై సియాట్ లోగో కనబడనుంది. ఇంతకుముందు రోహిత్ శర్మ, అజింక్య రహానే, శుభమాన్ గిల్, మయాంక్ అగర్వాల్, హర్మన్ప్రీత్ కౌర్ సియాట్తో బ్యాట్ ఎండార్స్మెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారు. తాజా ఒప్పందంతో రోహిత్, రహానే దారిలోనే శ్రేయాస్ కూడా నడిచాడు.
ఈ సందర్భంగా శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ... 'దేశంలో క్రికెట్కు ఎల్లప్పుడూ మద్దతునిచ్చే సియాట్తో ఒప్పందం కలిగి ఉండటం నా అదృష్టం. సియాట్తో సంబంధం కోసం నేను ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాను. ఈ దీర్ఘకాల సంబంధం ఇలాగే కొనసాగాలని నేను కోరుకుంటున్నా. ఆటలో రాణించడం చాలా ముఖ్యం. మైదానంలో మరింత గొప్పగా రాణించేందుకు కృషి చేస్తా' అని ఆయన పేర్కొన్నాడు.
సియాట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అనంత్ గోయెంకా మాట్లాడుతూ...'ఐపిఎల్, సియాట్ క్రికెట్ అవార్డులతో క్రికెట్ ఆటకు ఎప్పటికప్పుడు పెరుగుతున్న ప్రజాదరణను మేము విశ్వసిస్తూనే ఉన్నాము. శ్రేయాస్ అయ్యర్ బోర్డులో ఉండటం మాకు చాలా ఆనందంగా ఉంది. అద్భుత ప్రతిభ ఉన్న వారిలో శ్రేయాస్ ఒకరు. అతని ఆట శైలి బాగుంటుంది. అతన్ని సియాట్ కుటుంబానికి స్వాగతిస్తున్నాం. అయ్యర్ మైదానంలో విజయవంతం అవుతాడని ఆశిస్తున్నా' అని పేర్కొన్నాడు.
ముంబైలో జన్మించిన శ్రేయాస్ అయ్యర్ టాప్-ఆర్డర్ బ్యాట్స్మన్గా గుర్తింపు సాధించాడు. అతని బ్యాటింగ్ శైలి, అధిక స్ట్రైక్ రేట్ కారణంగా వేగంగా టీమిండియా జట్టులోకివచ్చాడు. శ్రేయాస్ ఆట తీరు మాజీ ఆటగాడు వీరేందర్ సెహ్వాగ్ను పోలి ఉంటుంది. శ్రేయాస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు గత సీజన్-12లో నాయకత్వం వచించాడు. అంతేకాదు ఏడు సంవత్సరాలలో మొదటిసారి జట్టును ప్లేఆఫ్స్కు చేర్చిన ఘనత సాధించాడు. శ్రేయాస్ అయ్యర్ 2017లో భారత్ తరఫున తన టి20, వన్డేల్లో అడుగుపెట్టాడు. ఇటీవల ముగిసిన భారత్, దక్షిణాఫ్రికా టి20 సిరీస్లో కూడా పాల్గొన్నాడు. అయితే ప్రస్తుత టెస్ట్ సిరీస్లో చోటు దక్కించుకోలేకపోయాడు.