
బెంగళూరు: ఆస్ట్రేలియా బౌలర్లు బౌన్సర్లతో నన్ను కవ్వించాలని చూశారు. కానీ.. ముందు క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నించు అని కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. సంయమనం పాటించి నా ప్రణాళికను అమలుపరిచా అని టీమిండియా యువ బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్డేడియం వేదికగా జరిగిన నిర్ణయాత్మక వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియా సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది.
బెంగళూరు వన్డేలో శ్రేయాస్ అయ్యర్ (35 బంతుల్లో 44: 6 ఫోర్లు, 1 సిక్సర్) అద్భుతంగా ఆడాడు. మ్యాచ్ అనంతరం అయ్యర్ మాట్లాడుతూ... 'ఆస్ట్రేలియా బౌలింగ్ను ఎదుర్కోవడం అంత సులువు కాదు. స్టార్క్, కమిన్స్, హేజిలీవుడ్ లాంటి స్టార్ పేసర్లు ఉన్నారు. ఇప్పటివరకు నేను ఆడిన మ్యాచుల్లో ఆసీస్ బౌలింగ్ బృందం ఎంతో పటిష్ఠమైనది. అలాంటి జట్టుపై చెలరేగితేనే సంతృప్తి ఉంటుంది. ఇది ఎక్కడైనా ఎవరితోనైనా తలపడటానికి నాలో విశ్వాసంను మరింత పెంచుతుంది' అని తెలిపాడు.
'మూడో వన్డేలో రోహిత్ పెవిలియన్ చేరాక క్రీజులోకి వచ్చాను. ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజులో నిలబడాలని నిర్ణయించుకున్నా. అయితే ఆసీస్ బౌలర్లు బౌన్సర్లు విసిరి నన్ను కవ్వించాలని చూశారు. నా తలపైకి వచ్చేలా బంతులు వేశారు. షాట్లు ఆడుతా అని కోహ్లీతో చెప్పా. ముందు క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నించమని కెప్టెన్ చెప్పాడు. దీంతో సంయమనం పాటించి నా ప్రణాళికను అమలుపరిచా తర్వాత భారీ షాట్లు ఆడా' అని అయ్యర్ చెప్పాడు.
మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (131), మార్నస్ లబుచేన్ (53), అలెక్స్ క్యారీ (35) రాణించడంతో ఆసీస్ తొలుత 286 పరుగులు చేసింది. మొహమ్మద్ షమీ (4/63), రవీంద్ర జడేజా (2/44) వికెట్లు తీశారు. అనంతరం రోహిత్ శర్మ (119), విరాట్ కోహ్లీ (89), శ్రేయస్ అయ్యర్ (44*) చెలరేగడంతో 47.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కోహ్లీతో కలిసి శ్రేయస్ మూడో వికెట్కు 68 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. కోహ్లీ ఔటైనా మనీశ్ పాండే (8*)తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.