న్యూజిల్యాండ్తో తొలి వన్డేకు సిద్ధం అవుతున్న భారత జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. వెన్నునొప్పితో స్టార్ ప్లేయర్ ఈ సిరీస్కు దూరమయ్యాడు. అతనెవరో కాదు టీమిండియా మిడిలార్డర్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్. గతేడాది అన్ని ఫార్మాట్లలో కలిపి భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచిన అతను.. కొత్త ఏడాదిలో అంతగా ఆకట్టుకోలేదు.
ఇటీవల ముగిసిన శ్రీలంక సిరీస్లో మూడు వన్డేల్లోనూ ఆడిన అతను 38, 28, 28 స్కోర్లు నమోదు చేశాడు. మంచి ఆరంభాలు లభించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యాడు. అయితే కివీస్తో సిరీస్లో ఈ పరిస్థితి మారుతుందని అంతా అనుకున్నారు. కానీ వెన్నునొప్పి కారణంగా అతను ఈ సిరీస్కు దూరమైనట్లు బీసీసీఐ కూడా ధ్రువీకరించింది. నిలకడగా రాణిస్తూ భారత వన్డే జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడీ ముంబై ప్లేయర్.
వన్డే ఫార్మాట్లో అతను ఎంత కీలకంగా మారాడంటే సూర్యకుమార్ యాదవ్ను కూడా కాదని అతనికే వన్డే జట్టులో మొదటి ప్రాధాన్యం ఇస్తోంది టీం మేనేజ్మెంట్. కానీ ఇప్పుడు అతను వెన్నునొప్పితో జట్టుకు దూరం అవడంతో ఈ సిరీస్లో సూర్యకుమార్ యాదవ్కు చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రేయాస్ ఈ సిరీస్కు దూరమైనట్లు ప్రకటించిన బీసీసీఐ.. అతని స్థానాన్ని రజత్ పటీదార్తో భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది. గత ఐపీఎల్ నుంచి రజత్ పటీదార్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్ తర్వాత దేశవాళీల్లో కూడా అద్భుతంగా రాణించాడీ మధ్యప్రదేశ్ బ్యాటర్. ఆ జట్టు తరఫున నిలకడగా రాణిస్తూ.. కీలకమైన ప్రతి మ్యాచ్లోనూ సెంచరీలతో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే అతనికి గతేడాది టీ20 వరల్డ్ కప్ ముందు జరిగిన సౌతాఫ్రికా సిరీస్లో కూడా చోటు కల్పించారు సెలెక్టర్లు. కానీ భారత్ తరఫున అరంగేట్రం చేసే అవకాశం మాత్రం అతనికి రాలేదు. సూర్యకుమార్ యాదవ్ ఉన్న నేపథ్యంలో కివీస్ సిరీస్లో కూడా అతనికి అవకాశం దక్కడం అసాధ్యంగానే కనిపిస్తోంది.