భారత ఆటగాళ్లకు సంబంధించిన 2023-24 సెంట్రల్ కాంట్రాక్ట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆదేశాలను పెడచెవిన పెట్టి దేశవాళీ టోర్నీలో పాల్గొనని కారణంతో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లపై బీసీసీఐ కొరడా ఝుళిపించింది. సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్లో ఈ యువ ప్లేయర్ల పేర్లను తొలగించింది.
అయితే శ్రేయస్ అయ్యర్ గురించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ప్రపంచకప్లో దేశం తరఫున ఆడాలనే ఉద్దేశంతోనే గత ఐపీఎల్ సీజన్కు శ్రేయస్ అయ్యర్ దూరమయ్యాడని, అంతేగాక నొప్పిని భరిస్తూనే వన్డే వరల్డ్ కప్ ఆడాడని ఓ జాతీయ మీడియా రాసుకొచ్చింది. శస్త్రచికిత్స అనంతరం ఇంజెక్షన్లు తీసుకుంటూ మెగాటోర్నీలో కొనసాగాడని పేర్కొంది. స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా రన్నరప్గా నిలిచిన సంగతి తెలిసిందే. 11 మ్యాచ్ల్లో శ్రేయస్ 66 సగటుతో 530 పరుగులు సాధించాడు.

ఈ మెగాటోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఏడో ఆటగాడిగా, మూడో భారత ప్లేయర్గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. రెండు శతకాలు బాదాడు. సెమీఫైనల్లో న్యూజిలాండ్పై మెరుపు శతకం సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 70 బంతుల్లో 105 పరుగులు చేశాడు. 4 ఫోర్లు, 8 సిక్సర్లు సాధించాడు.
''వన్డే వరల్డ్ కప్ కోసం శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్-2023ను వదులుకున్నాడు. శస్త్రచికిత్స అనంతరం కూడా మూడు కార్టిసోన్ ఇంజెక్షన్లను తీసుకుని ప్రపంచకప్లో శ్రేయస్ పాల్గొన్నాడు. సెమీఫైనల్, ఫైనల్లో నొప్పి తిరగబెట్టింది. అయినా ఆటను కొనసాగించాడు. ఆ తర్వాత వరుసగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ సిరీస్లు ఆడాడు'' అని ఓ జాతీయ మీడియా శ్రేయస్ పరిస్థితిని వివరిస్తూ రాసుకొచ్చింది.
ఈ నేపథ్యంలో శ్రేయస్కు మద్దతుగా నెటిజన్లు నిలుస్తున్నారు. శ్రేయస్ అయ్యర్కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను తొలగించడంపై మండిపడుతున్నారు. ఈ మిడిలార్డర్ బ్యాటర్ విషయంలో బీసీసీఐ పెద్ద తప్పు చేసిందని అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ను త్యాగం చేసి, నొప్పిని భరిస్తూ ప్రపంచకప్ ఆడినా.. శ్రేయస్కు ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, శ్రేయస్ అయ్యర్ ఈ విషయాలన్నింటిని పక్కనపెట్టి తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబై తరఫున బరిలోకి దిగాడు.