టీమిండియా యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీలో రీఎంట్రీ ఇచ్చాడు. తమిళనాడుతో జరుగుతున్న సెమీఫైనల్లో ముంబై తరఫున బరిలోకి దిగాడు. ఇటీవల బీసీసీఐ విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్లో శ్రేయస్ చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. శ్రేయస్తో పాటు ఇషాన్ కిషన్ కూడా జాబితాలో చోటును దక్కించుకోలేకపోయాడు.
ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టు అనంతరం శ్రేయస్ అయ్యర్ టీమిండియాకు దూరమయ్యాడు. చివరి మూడు టెస్టులకు ఎంపికవ్వలేదు. తొలుత గాయం కారణంగా భారత జట్టులో ఎంపిక కాలేదని వార్తలు వచ్చాయి. కానీ పేలవమైన ఫామ్తో టీమిండియాలో చోటు కోల్పోయాడని తర్వాత తెలిసింది.

మరోవైపు టీమిండియాకు దూరమైన ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో పాల్గొనాలని అదే సమయంలో బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. కానీ, గాయం కారణంగా క్వార్టర్ ఫైనల్స్ను ఆడట్లేదని శ్రేయస్ తెలిపాడు. ఆ తర్వాతే అసలు ట్విస్ట్. శ్రేయస్కు గాయమేమి అవ్వలేదని, మ్యాచ్ ఆడే ఫిట్నెస్తో ఉన్నాడని బీసీసీఐకి ఎన్సీఏ నివేదిక ఇచ్చింది. దీంతో శ్రేయస్పై బీసీసీఐ కొరడా ఝుళిపించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ముంబై జట్టుకు శ్రేయస్ అందుబాటులో వచ్చాడు. శ్రేయస్ పునరాగమనం గురించి ముంబై కెప్టెన్ అజింక్య రహానె మాట్లాడాడు. ''శ్రేయస్ అయ్యర్ అనుభవజ్ఞుడు. ముంబై జట్టుకు అతని సహకారం అద్భుతమైనది. ముంబైకి ప్రాతినిథ్యం వహించప్పుడల్లా గొప్పగా రాణించాడు. ఇక అతనికి ఎలాంటి ప్రోత్సాహం, సలహాలు అవసరం లేదని భావిస్తున్నా. సెమీఫైనల్స్లో అతడు జట్టుకు అందుబాటులో ఉన్నందకు సంతోషిస్తున్నాం. అతని ఉనికి ఇతర ఆటగాళ్లకు ఉపయోగపడుతుంది'' అని రహానె అన్నాడు.
కాగా, రహానె తన పేలవ ఫామ్ గురించి స్పందించాడు. ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్లో రహానె నిరాశపరిచాడు. గత 10 ఇన్నింగ్స్ల్లో రహానె అత్యధిక స్కోరు 56 నాటౌట్. టీమిండియాలో చోటు కోల్పోయిన రహానె దేశవాళీ క్రికెట్లోనూ విఫలమవుతున్నాడు.
''క్రికెటర్లకు ఇది ఓ దశ మాత్రమే. బ్యాటింగ్ బాగా చేస్తూ పరుగులు సాధించి ఈ దశను అధిగమిస్తుంటాయి. అయితే నా బ్యాటింగ్ ధోరణిలో ఎలాంటి తప్పు లేదనిపిస్తుంది. ఇది కేవలం ఓ దశ మాత్రమే. దీన్ని నేను గౌరవిస్తా. కానీ, నేను నమ్మకంతో ఉన్నా. సత్తాచాటి తిరిగి నా లయను అందుకుంటా. నా అనుభవంతో స్వేచ్ఛగా ఆడతాను'' అని రహానె పేర్కొననాడు.