
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం అవనుంది. అయితే కొంత మంది కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా ఈ సీజన్కు దూరమవుతున్న సంగతి తెలిసిందే. వీరిలో టీమిండియా స్టార్లు జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్ తదితర ఆటగాళ్లు కూడా ఐపీఎల్కు దూరమయ్యారు. వీరి జాబితాలోనే శ్రేయాస్ అయ్యర్ కూడా చేరాల్సింది. ఈ ఏడాది ఆరంభం నుంచే అయ్యర్ పరిస్థితి ఏం బాగలేదు. వెన్నునొప్పి కారణంగా న్యూజిల్యాండ్తో వన్డే సిరీస్కు దూరమయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో తొలి మ్యాచ్కు కూడా అయ్యర్ దూరమయ్యాడు.
తర్వాత జరిగిన రెండు టెస్టుల్లో పెద్దగా రాణించని అతను.. చివరి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో మళ్లీ వెన్నునొప్పి తిరగబెట్టడంతో ఆటకు దూరమయ్యాడు. అతనికి శస్త్రచికిత్స కావాలని వైద్యులు చెప్పారు. అదే జరిగితే అయ్యర్ ఆటకు చాలా రోజులపాటు దూరం అవ్వాల్సి ఉంటుంది. ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్తోపాటు ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్లో కూడా ఆడటం జరగదు. ఇలాంటి సమయంలో అతన్ని ముందుగా పదిరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. నేషనల్ క్రికెట్ అకాడమీ పెద్దలు కూడా అతనితో మాట్లాడి శస్త్రచికిత్సపై నిర్ణయం తీసుకోవాలని సూచించారట.
అయితే ఆటకు అంత కాలం దూరం అవడం ఇష్టం లేని అయ్యర్.. ఆపరేషన్ అప్పుడే చేయించుకోకూడదని అనుకుంటున్నట్లు సమాచారం. ఆసీస్తో జరిగిన వన్డే సిరీస్లో అయ్యర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అతని స్థానంలో జట్టులోకి తీసుకున్న సూర్యకుమార్ యాదవ్ వరుసగా మూడు మ్యాచుల్లో గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో వన్డే వరల్డ్ కప్లో అయ్యర్ చాలా కీలకం కానున్నాడు. ఈ నేపథ్యంలోనే వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొన్న బీసీసీఐ.. అయ్యర్ పరిస్థితిని మానిటర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.