Shreyas Iyer: ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆడుతున్నాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో జట్టు ప్రదర్శన చాలా బాగుంది. పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ 4లో ఉంది. ఇంతలో ఐసీసీ శ్రేయస్ అయ్యర్ పేరును ఒక ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ చేసింది. ఈ అవార్డు కోసం శ్రేయస్ అయ్యర్ మరో ఇద్దరు గొప్ప ఆటగాళ్లతో పోటీ పడుతున్నాడు. అత్యుత్తమ ఆటగాడిగా పరిగణించబడే ప్లేయర్ కు ఈ గౌరవం దక్కుతుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్
ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి టీమిండియా విజయం కీలకపాత్ర పోషించాడు. మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తూ శ్రేయర్ అయ్యర్ చాలా పరుగులు చేసి జట్టును బలమైన స్థితిలో ఉంచాడు. ఈ టోర్నమెంట్లో మార్చి నెలలో శ్రేయస్ అయ్యర్ మొత్తం 172 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ సగటు 57.33 కాగా.. అతను 77.47 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేశాడు.

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. టోర్నమెంట్ అంతటా అపజయం లేకుండా నిలిచింది. ఈ విజయంలో శ్రేయస్ అయ్యర్ పాత్ర చాలా ఉంది. ఈ అద్భుతమైన ప్రదర్శన కారణంగా ఐసీసీ శ్రేయస్ అయ్యర్ ను మార్చి నెలలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ చేసింది. శ్రేయస్ తో పాటు న్యూజిలాండ్ కు చెందిన జేకబ్ డఫీ, రచిన్ రవీంద్ర కూడా నామినేట్ అయ్యారు. మరో వైపు మహిళల విభాగంలో ఈ అవార్డు కోసం చేతన ప్రసాద్(అమెరికా), జార్జియా వాల్(ఆస్ట్రేలియా), అన్నాబెల్ సదర్ల్యాండ్(ఆస్ట్రేలియా) పోటీ పడుతున్నారు.
పోటీదారులుగా నిలిచిన రచిన్ రవీంద్ర, జేకబ్ ఢఫీ
శ్రేయస్ అయ్యర్తో పాటు మార్చి నెలకు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు న్యూజిలాండ్ కు చెందిన ఇద్దరు ఆటగాళ్లను కూడా ఐసీసీ నామినేట్ చేసింది. మొదటి స్థానంలో రచిన్ రవీంద్ర ఉన్నాడు. రచిన్ రవీంద్ర ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శనను ప్రదర్శించాడు. తన జట్టును ఫైనల్స్ కు తీసుకెళ్లడంతో కీలక పాత్ర పోషించాడు. రచిన్ రవీంద్ర 50.33 సగటుతో, 106.33 స్ట్రైక్ రేట్ తో 151 పరుగులు చేశాడు. రచిన్ రవీంద్ర 3 వికెట్లు కూడా తీసుకున్నాడు.
మరో ఆటగాడు జేకబ్ డఫీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడలేదు కానీ పాకిస్థాన్ తో జరిగిన టీ20 సిరీస్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్ లో పర్యటించింది. రెండు జట్ల మధ్య 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ జరిగింది. ఈ సిరీస్ ను న్యూజిలాండ్ 4-1 తేడాతో గెలుచుకుంది. ఈ సిరీస్ లో జేకబ్ డఫీ 13 వికెట్లు పడగొట్టి పాకిస్థాన్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. తన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో జేకబ్ డఫీ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో నంబర్ 1 బౌలర్ అయ్యాడు. ఇప్పుడు ఈ ముగ్గురు ఆటగాళ్లలో శ్రేయస్ అయ్యర్, రచిన్ రవీంద్ర, జేకబ్ డఫీలలో ఒకరిని ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు వరించనుంది. ఐసీసీ ఓటింగ్ అకాడమీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు తమ ఓట్ల ద్వారా విజేతలను నిర్ణయిస్తారు. విజేతల పేర్లు వచ్చే వారం ప్రకటిస్తారు.