
ముంబై: ఫిబ్రవరి 20 నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. టోర్నీ కోసం అన్ని రాష్ట్రాల జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఈ టోర్నమెంట్కు సలీల్ అంకోలా నేతృత్వంలోని ముంబై సెలక్షన్ కమిటీ 22 మంది సభ్యుల బృందాన్ని బుధవారం ప్రకటించింది. టీమిండియా యువ బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఇక భారత ఓపెనర్ పృథ్వీ షా వైస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
భుజం గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే. గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగనున్నాడు. అయ్యర్, షా ఇద్దరూ ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లలో ఆడట్లేదు. మార్చి 12 నుంచి ఐదు మ్యాచుల టీ20 సిరీస్, మార్చి 23 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్నాయి. ఆ సిరీస్లలో శ్రేయస్ ఆడనున్నాడు. ఇక ముంబై జట్టులో సీనియర్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్, యంగ్ ఓపెనర్ యశస్వి, సర్ఫరాజ్ ఖాన్, వికెట్ కీపర్-బ్యాట్స్మన్ ఆదిత్య తారే, సీనియర్ బౌలర్ దవల్ కులకర్ణి, తుషార్ దేశ్పాండేతో పాటు ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు.
ఈ టోర్నమెంట్ కోసం భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రమేశ్ పవార్ను ముంబై జట్టు ప్రధాన కోచ్గా ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) మంగళవారం నియమించిన విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ముంబై పేలవ ప్రదర్శన చేయడంతో కోచ్ పదవి నుంచి భారత మాజీ స్పిన్నర్ అమిత్ పాగ్నిస్ తప్పుకున్నాడు. దీంతో ముంబై క్రికెట్ కమిటీ కొత్త కోచ్గా పవార్ను ప్రతిపాదించింది. ఇప్పటికైతే ఈ నియామకం ప్రస్తుత సీజన్కు మాత్రమేనని, భవిష్యత్త్లో కొనసాగించడాన్ని తర్వాత పరిశీలిస్తామని ఎంసీఏ అధికారి ఒకరు చెప్పారు.
రమేశ్ పవార్ గతంలో భారత మహిళా క్రికెట్ జట్టుకి కోచ్గా వ్యవహరించాడు. 42 ఏళ్ల రమేశ్ భారత్ తరఫున రెండు టెస్టులు, 31 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక ముంబై జట్టు ట్రోఫీ కోసం త్వరలోనే జైపూర్ వెళ్లనుంది. ఈ సంవత్సరంలో జరుగనున్న రెండవ దేశీయ టోర్నమెంట్ ఇదే. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ బయో బబుల్ వాతావరణంలో గత నెల నిర్వహించిన విషయం తెలిసిందే. విజయ్ హజారే ట్రోఫీ కూడా అలానే జరగనుంది.
ముంబై జట్టు:
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), పృథ్వీ షా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అఖిల్ హెర్వాడ్కర్, సూర్యకుమార్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్, చిన్మయ్ సుతార్, ఆదిత్య తారే, హార్దిక్ తమోర్, శివం దుబే, ఆకాష్ పార్కర్, అతిఫ్ అంటార్వాలా, షమ్స్ ములన్ సైరాజ్ పాటిల్, సుజిత్ నాయక్, తనూష్ కోటియన్, ప్రశాంత్ సోలంకి, ధవల్ కులకర్ణి, తుషార్ దేశ్పాండే, సిద్ధార్థ్ రౌత్, మోహిత్ అవస్థీ.