బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్లో యువ క్రికెటర్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ చోటు కోల్పోవడంపై మిశ్రమ స్పందన వస్తుంది. రెడ్ బాల్ క్రికెట్ను గౌరవించని వాళ్లకి ఇది సరైన గుణపాఠమని కొందరు మెచ్చుకుంటున్నారు. మరికొందరు ఈ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. ఆటగాళ్లందరిని సమానంగా చూడాలని, వివక్షతో ఇద్దరిపై వేటు వేయడం సమంజసం కాదని అభిప్రాయపడుతున్నారు.
తాజాగా ఈ విషయంపై టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా మాట్లాడాడు. దేశవాళీ క్రికెట్ వల్ల ఆటగాళ్లకు మేలు కలుగుతుందని, కెరీర్లో విజయవంతం అవ్వడానికి ఉపయోగపడుతుందని సాహా అన్నాడు. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించడం బీసీసీఐ నిర్ణయమని, అయితే బలవంతంగా ఆటగాళ్లలో మార్పు తీసుకురాలేరని పేర్కొన్నాడు.

''అది బీసీసీఐ నిర్ణయం. సంబంధిత ఆటగాళ్ల గురించి తీసుకున్న వ్యక్తిగత నిర్ణయం. అయితే బలవంతంగా మీరేం చేయలేరు. నేను ఫిట్గా ఉన్నప్పుడు ఆఫీస్, క్లబ్ మ్యాచ్లు ఆడతా. ఏ మ్యాచ్ను అయినా సరే మ్యాచ్గానే గౌరవిస్తా. అన్ని మ్యాచ్లను సమానంగా భావిస్తా. ప్రతి క్రికెటర్ ఇదే కోణంలో ఆలోచిస్తే.. అతడి కెరీర్తో పాటు భారత క్రికెట్కు మంచిది''
''దేశవాళీ క్రికెట్కు కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. సర్ఫరాజ్ ఖాన్ విషయంలో ఇది రుజువైంది. గత నాలుగేళ్లుగా పరుగులు సాధించిన అతడికి అవకాశాలు దక్కాయి'' అని సాహా అన్నాడు. ఇంగ్లండ్తో జరిగిన రాంచీ టెస్టు భారత విజయంలో కీలకపాత్ర పోషించిన ధ్రువ్ జురెల్ను సాహా కొనియాడాడు.
''దేశవాళీ క్రికెట్, టెస్టుల్లో ధ్రువ్ జురెల్ ఆటను నేరుగా చూడలేదు. కానీ హైలైట్స్ చేశాను. అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. గత టెస్టులో టీమిండియాను గెలిపించాడు. రిజర్వ్ బెంచ్ పటిష్టంగా ఉండటం చాలా మంచిది. ఇక కొంతమందికి అవకాశాలు వస్తున్నా ఆడాలనుకోవట్లేదు. ఆడే ఛాన్స్ వస్తే రెడ్ బాల్, వైట్ బాల్ క్రికెట్ అని చూడకూడదు'' అని సాహా తెలిపాడు. 39 ఏళ్ల సాహా భారత్ తరఫున చివరిగా 2021 డిసెంబర్లో న్యూజిలాండ్తో ఆడాడు.