భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆస్ట్రేలియాపై చివరి వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడటం, ప్రస్తుతం ఆయన సిడ్నీ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతుండటంతో జట్టుకు బిగ్ షాక్ తగిలింది. శ్రేయస్ అయ్యర్ కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నందున నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా సిరీస్లో ఖాళీ అయిన కీలకమైన నంబర్ 4 స్థానం కోసం జట్టు యాజమాన్యం ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఈ స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం ఉన్న ముగ్గురు ఆటగాళ్ల పేర్లు చర్చకు వచ్చాయి. వారిలో ఒకరు 50 కంటే ఎక్కువ వన్డే సగటును కలిగి ఉండటం విశేషం.
1. సంజూ శాంసన్
ఈ స్థానానికి మొదటి,బలమైన ఎంపికగా సంజూ శాంసన్ పేరు వినిపిస్తోంది. సంజూ శాంసన్ ప్రధానంగా టాపార్డర్లో బ్యాటింగ్ చేసే ఆటగాడు అయినప్పటికీ.. నంబర్ 4 స్థానం ఖాళీగా ఉండటంతో గత వన్డే సిరీస్లో సంజూ చూపిన అద్భుతమైన ఫామ్ను దృష్టిలో ఉంచుకుని అతనికి అవకాశం దక్కే అవకాశాలు మెరుగయ్యాయి. సంజూ శాంసన్ ఇప్పటివరకు ఆడిన 16 వన్డే మ్యాచ్లలో 56.66 అద్భుతమైన సగటుతో 510 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇది సంజూ శాంసన్ను ఈ రేసులో బలమైన ఆటగాడిగా నిలబెడుతుంది. శ్రేయస్ అయ్యర్ స్థానంలో నంబర్ 4లో సులభంగా సరిపోయే సామర్థ్యం సంజూకు ఉంది.

2. తిలక్ వర్మ
ఈ జాబితాలో రెండో పేరు మన తెలుగు ఆటగాడు తిలక్ వర్మ. గత నెలలో ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్పై మ్యాచ్ గెలిపించిన ఇన్నింగ్స్తో తిలక్ వర్మ రాత్రికి రాత్రే స్టార్గా మారాడు. తిలక్ వర్మ 2023లో బంగ్లాదేశ్పై వన్డేల్లో అరంగేట్రం చేసినప్పటికీ.. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్లలో కేవలం 68 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఆసియా కప్లో ప్రదర్శన తర్వాత తిలక్ వర్మ మంచి ఫామ్లో, అత్యంత ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. యువ ఆటగాడైన తిలక్ వర్మను ఎంపిక చేస్తే దక్షిణాఫ్రికా సిరీస్లో నంబర్ 4లో భారత బ్యాటింగ్కు మరింత బలం, దూకుడు లభిస్తాయి.
3. రియాన్ పరాగ్
మూడో ఎంపిక రియాన్ పరాగ్. రియాన్ పరాగ్ గత ఏడాది శ్రీలంకతో వన్డేల్లో అరంగేట్రం చేసినప్పటికీ.. గాయం కారణంగా జట్టు నుంచి దూరమయ్యాడు. రియాన్ పరాగ్ ఆడిన ఏకైక వన్డేలో 15 పరుగులు చేసి, 9 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టాడు. రియాన్ పరాగ్ భారత్ తరఫున 9 టీ20 మ్యాచ్లు కూడా ఆడాడు. రియాన్ పరాగ్ నంబర్ 4లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యంతో పాటు, జట్టుకు అదనపు బౌలింగ్ ఎంపికను కూడా అందిస్తాడు. అతని ఆల్రౌండ్ నైపుణ్యం జట్టు కూర్పుకు అవసరమైన సమతుల్యతను తీసుకురావడంలో సహాయపడుతుంది.
ఈ ముగ్గురు ఆటగాళ్లలో, సంజూ శాంసన్ 56.66 అనే అత్యుత్తమ వన్డే సగటును కలిగి ఉండటం వల్ల శ్రేయస్ అయ్యర్ స్థానంలో నంబర్ 4 స్థానానికి బలమైన పోటీదారుగా నిలుస్తున్నాడు. ఏదేమైనా, తుది ఎంపిక జట్టు అవసరాలు, సెలెక్టర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.