బుచ్చిబాబు టోర్నీలో తమిళనాడు జట్టు సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. ముంబైతో జరిగిన మ్యాచ్లో తమిళనాడు జట్టు 286 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్కు దూసుకెళ్లింది. అయితే ముంబై తరఫున బరిలోకి దిగిన స్టార్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్ రెండో ఇన్నింగ్స్లోనూ విఫమలయ్యారు. ఇక సూర్యకుమార్ యాదవ్ గాయం గురించి జాగ్రత వహిస్తూ బ్యాటింగ్కు కూడా రాలేదు.
తొలి ఇన్నింగ్స్లో తమిళనాడు 379 పరుగులు చేసింది. భూపతి (82) టాప్ స్కోరర్. అజిత్ రామ్ (53) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. హిమాన్షు సింగ్ అయిదు వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం ముంబై మొదటి ఇన్నింగ్స్లో 156 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ దివ్యాన్ష్ (70) మినహా ఎవరూ రాణించలేదు. శ్రేయస్ (2), సూర్య (30), కెప్టెన్ సర్ఫరాజ్ (6) పరుగులు చేశారు. ఆర్ సాయి కిషోర్ అయిదు వికెట్లతో అదరగొట్టాడు.

రెండో ఇన్నింగ్స్లో తమిళనాడు 286 పరుగులు చేసింది. లోకేశ్వర్ (73) టాప్ స్కోరర్. తనుష్ అయిదు వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారీ ఛేదనకు దిగిన ముంబై 223 పరుగులకే ఆలౌటైంది. శ్రేయస్ (22) మరోసారి నిరాశపరిచాడు. సర్ఫరాజ్ డకౌటయ్యాడు. అయితే శ్రేయస్ ఔటైన తీరుపై తీవ్రంగా చర్చ సాగుతోంది. దానికి కారణం శ్రేయస్ మరోసారి షార్ట్ పిచ్ బాల్కు ఔటవ్వడం.
షార్ట్ పిచ్ బంతులకు శ్రేయస్ వికెట్లను తేలికగా సమర్పించుకుంటాడని సగటు క్రికెట్ ప్రేక్షకులకు తెలిసిన విషయమే. ఈ ఏడాది ఇంగ్లండ్తో జరిగిన చివరి మూడు టెస్టులకు శ్రేయస్ను టీమిండియా నుంచి తప్పించడానికి ఇదీ ఓ కారణం. కానీ శ్రేయస్ తన బలహీనతను అదేరీతిలో కొనసాగించుకుంటున్నాడు. ఇదే రీతిలో షార్ట్ పిచ్ బాల్స్ వికెట్లు చేజార్చుకుంటే శ్రేయస్ టీమిండియా టెస్టు జట్టులోకి రావడం కష్టమే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.