ఇంగ్లండ్తో చివరి మూడు టెస్టులకు ప్రకటించిన భారత జట్టులో యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు స్థానం దక్కలేదు. వెన్నునొప్పి కారణంగా అతడికి విశ్రాంతి ఇచ్చారని తొలుత కథనాలు వచ్చాయి. కానీ అది ప్రధాన కారణం కాదని, పరుగులు సాధించడంలో విఫలమవ్వడంతో అతడిపై వేటు పడిందని తర్వాత తెలిసింది.
అయితే రెండో టెస్టు ముగిసిన అనంతరం శ్రేయస్ అయ్యర్ తన ఫిట్నెస్ను మెరుగుపర్చుకోవడానికి ఎన్సీఏకి వెళ్లాడు. తన గాయం తిరగబెట్టిందని, వెన్నునొప్పి వస్తుందని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి వెళ్లాడు. ఈ కారణాలతో రంజీ ట్రోఫీకి కూడా దూరమయ్యాడు. శుక్రవారం నుంచి బరోడాతో జరిగే రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్లో తమ జట్టుకు అందుబాటులో శ్రేయస్ అందుబాటులో ఉండట్లేదని ముంబయి క్రికెట్ అసోషియేషన్ కూడా ప్రకటించింది.

కానీ ఎన్సీఏ ఇచ్చిన తాజా నివేదిక శ్రేయస్ అయ్యర్ పేర్కొన్న వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఉంది. అసలు శ్రేయస్ అయ్యర్కు 'తాజా గాయమే' లేదని, అతను ఫిట్గా ఉన్నాడని ఎన్సీఏ రిపోర్ట్ ఇచ్చింది. జట్టుకు అందుబాటులో ఉండే సామర్థ్యంతో ఉన్నాడని బీసీసీఐకి ఎన్సీఏ నివేదిక పంపింది. దీంతో శ్రేయస్ అయ్యర్ వైఖరిపై విమర్శలు మొదలయ్యాయి. దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ అయిన రంజీలో ఆడటానికి యువ క్రికెటర్లు ఎందుకు ఆసక్తిచూపట్లేదని తీవ్రంగా విమర్శిస్తున్నారు.
మరో నెల రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ను దృష్టిలో పెట్టుకుని శ్రేయస్ ఇలా వ్యవహరిస్తున్నాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా రంజీట్రోఫీలో పాల్గొనని విషయం తెలిసిందే. దేశవాళీ క్రికెట్ ఆడితేనే మానసిక అలసటతో దూరమైన అతడు తిరిగి భారత జట్టులోకి వస్తాడని టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నప్పటికే ఇషాన్ కిషన్ బరిలోకి దిగలేదు. ఈ నేపథ్యంలో ఆటగాళ్లకు బీసీసీఐ హెచ్చిరించింది.
టీమిండియాకు దూరమై, గాయపడకుండా ఫిట్గా ఉన్న సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లు తప్పక రంజీ ట్రోఫీలో పాల్గొనాలని మెయిల్స్ కూడా చేసింది. అయినప్పటికీ శ్రేయస్ దూరం అవ్వడం గమనార్హం. ఈ విషయంపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.