ప్రతిష్ఠాత్మ రంజీ ట్రోఫీని ముంబై జట్టు కైవసం చేసుకుంది. వాంఖడే వేదికగా విదర్భతో జరిగిన ఫైనల్లో 169 పరుగుల తేడాతో ముంబై ఘనవిజయం సాధించింది. రంజీ చరిత్రలో ముంబై 42వ సారి ఛాంపియన్గా నిలవడం విశేషం. అయితే విదర్భ అంత సులువుగా ఓటమిని అంగీకరించలేదు. గొప్పగానే పోరాడింది.
538 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ 368 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 248/5తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన విదర్భ నిలకడగా ఆడింది. కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (102; 199 బంతుల్లో), హర్ష్ దూబె (65; 128 బంతుల్లో) సాధికారికంగా ఆడుతూ స్కోరుబోర్డు ముందుకు నడిపించారు. తొలి సెషన్లో ముంబై బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. అయితే వారిద్దరి 130 పరుగుల భాగస్వామ్యం అనంతరం విదర్భ పతనం మొదలైంది. 15 పరుగులకే విదర్భ చివరి అయిదు వికెట్లు కోల్పోయింది.

మ్యాచ్ అనంతరం విదర్భ కెప్టెన్ అక్షయ్ వాద్కర్ మాట్లాడాడు. ముంబై రెండో ఇన్నింగ్స్లో శ్రేయస్ అయ్యర్ దూకుడు ఆటతీరుతో మ్యాచ్పై పట్టు కోల్పోయామని అక్షయ్ తెలిపాడు. శ్రేయస్ అయ్యర్ 115 బంతుల్లో 95 పరుగులు చేశాడు. ''తొలి ఇన్నింగ్స్లో మేం విఫలమయ్యాం. బ్యాటింగ్లో సత్తాచాటలేకపోయాం. మొదటి ఇన్నింగ్స్లో ముంబైను త్వరగా ఆలౌట్ చేసిన తర్వాత మేం బ్యాటుతో రాణించాల్సింది. కానీ అలా చేయలేకపోయాం. ఫైనల్లో అది మమ్మల్ని తీవ్రంగా దెబ్బకొట్టింది. అంతేగాక ముంబై బౌలింగ్లో మెరిసింది. ముఖ్యంగా ధావల్ కులకర్ణి గొప్పగా బౌలింగ్ చేశాడు''
''ఈ పిచ్పై బ్యాటింగ్ చేయడం కష్టతరమే. కానీ ముంబై బ్యాటర్లు సంకల్పంతో బ్యాటింగ్ చేశారు. అయితే మాకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేదు. ముషీర్ ఖాన్ రనౌట్ మిస్ అయ్యింది. ఎల్బీడబ్ల్యూను రహానె అంపైర్ కాల్తో తప్పించుకున్నాడు. వాళ్ల భాగస్వామ్యంతో మ్యాచ్పై నియంత్రణ కోల్పోయాం. ఇక శ్రేయస్ అయ్యర్ తక్కువ బంతుల్లోనే వేగంగా పరుగులు సాధించాడు. అతని దూకుడైన బ్యాటింగ్తో మ్యాచ్ను కోల్పోయాం''
''అయితే ఇవాళ ఉదయం మేం (హర్ష్ దూబేతో కలిసి) బంతి బంతిని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాం. డిఫెన్స్ చేస్తూ ప్రత్యర్థికి విసుగు తెప్పించాలని భావించాం. వాళ్లు ఫ్రస్టేషన్లో తప్పులు చేస్తారనుకున్నాం. అంతేగాక ఇదే మా ప్రధాన భాగస్వామ్యంగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే మా తర్వాత వచ్చే ప్లేయర్లు కేవలం డిఫెండ్ మాత్రమే చేయగలరు. స్కోర్లు సాధించలేరు'' అని అక్షయ్ వాద్కర్ పేర్కొన్నాడు.