
టీమిండియా యువ ప్లేయర్లు శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్ చాలా సరదాగా గడిపారు. నేషనల్ క్రికెట్ అకాడమీలో నెట్స్లో ప్రాక్టీస్ సందర్భంగా ఇద్దరూ 'కబడ్డీ.. కబడ్డీ..' అంటూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను వాషింగ్టన్ సుందర్ తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేశాడు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో పాతదా? లేక ఇటీవల జరిగిందా? అనేది తెలియడం లేదు. అంతకుముందు గాయాల కారణంగా వాషింగ్టన్ సుందర్ చాలా కాలం పాటు ఎన్సీయేలో గడిపిన సంగతి తెలిసిందే.
గాయం నుంచి కోలుకున్న తర్వాత గతేడాది పునరాగమనం చేసిన వాషీ.. కివీస్తో న్యూజిల్యాండ్లో జరిగిన వన్డే సిరీసులో రాణించాడు. తాజాగా స్వదేశంలో భారత్, న్యూజిల్యాండ్ మధ్య జరిగిన టీ20 సిరీసులో కూడా సత్తా చాటాడు. రెండు మ్యాచుల్లో మూడు వికెట్లు తీయడంతోపాటు 60 పరుగులు కూడా చేశాడు. అయితే ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్లో పెద్దగా ఆకట్టుకోలేదు. మూడు మ్యాచుల్లో కలిపి రెండు వికెట్లు తీసుకున్న అతను.. కేవలం 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
ఇక శ్రేయాస్ అయ్యర్ కూడా వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఎన్సీయేలోనే ట్రీట్మెంట్ తీసుకున్న అతను.. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో పునరాగమనం చేశాడు. అయితే ఈ మ్యాచ్లో అయ్యర్ రాణించలేదు. తొలి ఇన్నింగ్స్లో కేవలం నాలుగు పరుగులకే అవుటైన అతను.. రెండో ఇన్నింగ్స్లో 12 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
అయితే గతేడాది భారత జట్టులో వన్డే, టెస్టు ఫార్మాట్లలో అద్భుతంగా రాణించాడీ ముంబై కుర్రాడు. ఈ రెండు ఫార్మాట్లలో భారత్ బెస్ట్ బ్యాటర్గా నిలిచాడు. గతేడాది చివర్లో బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో కూడా భారత్ తరఫున టాప్ స్కోరర్ అతనే. ఆసీస్తో జరిగే మిగతా మ్యాచుల్లో అతను రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.