న్యూఢిల్లీ: ఫిబ్రవరి 14న ప్రారంభం కానున్న ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్లను టీవీలో వీక్షించేందుకు గాను క్రికెట్ అభిమానులు ఎలాంటి స్పోర్ట్స్ ప్యాకేజీలకు సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్లు దూరదర్శన్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని దేశ అత్యున్నత న్యాయస్ధానం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
దూరదర్శన్లో మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేస్తే, కేబుల్ టీవీ ఆపరేటర్లు ఉచితంగా ఫీడ్ పొందుతారని, అందువల్ల తాము ఆర్ధికంగా నష్టపోతామని స్టార్ టీవీ నెట్ వర్క్, బీసీసీఐలు కోర్టులో వాదించాయి. వీరి వాదనను సుప్రీం కోర్టు కొట్టి వేసింది.
జస్టిస్ రంజన్ గోగాయ్, జస్టిన్ పినాకి చంద్ర ఘోస్ నేతృత్వంలోని బెంచ్ మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు సైతం మ్యాచ్లను వీక్షించాలంటే దూరదర్శన్ పైనే ఆధారపడతారు, ఏడు సంవత్సరాలుగా ఉచితంగా ఫీడ్ను పొందుతున్నారు. దానినే కంటిన్యూ చేయండంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఎట్టి పరిస్ధితుల్లో దూరదర్శన్లో మ్యాచ్లను ప్రసారం చేయాల్సిందేనంటూ ఆదేశించి, దీనిపై స్టార్ స్పోర్ట్స్ వారి సలహాలను సమర్పించడానికి ఫిబ్రవరి 17 వరకు గడువిచ్చింది. ఫిబ్రవరి 14న ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 15న అడిలైడ్లో టీమిండియా, పాకిస్ధాన్తో తలపడనుంది.
ఈ ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్ని ఆస్టేలియా-న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. టోర్నమెంట్లో మొత్తం 14 జట్లు పాల్గొంటున్నాయి. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 29 వరకు టోర్నమెంట్ జరగనుంది. ఐసీసీ వరల్డ్ ఫైనల్కు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యం ఇస్తుంది.