ఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్కు వీడ్కోలు పైన తన మనసులో మాటను బయటపెట్టాడు. ఓ ఛానల్ నిర్వహించే ఆప్ కీ అదాలద్ కార్యక్రమంలో మాట్లాడాడు. ఈ సందర్భంగా రిటైర్మెంట్ పైన తన మనసులోని బాధను బయటపెట్టాడు. ఈ బాధ ఎప్పుడూ ఉంటుందన్నాడు.
మ్యాచ్లు ఆడుతూ రిటైరవ్వలేదన్న బాధ తనకు ఎప్పటికీ ఉంటుందని వ్యాఖ్యానించాడు. సెలక్టర్లు తనను తప్పిస్తున్నట్లు చెప్పి ఉంటే, ఢిల్లీలో తన వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వమని అడిగేవాణ్ణని, రిటైర్మెంట్ ప్రకటించేవాణ్ని అన్నాడు.

కానీ తనకు ఆ అవకాశం ఇవ్వలేదన్నాడు. మ్యాచ్లు ఆడుతూ రిటైరయ్యే అవకాశం దక్కకపోతే ఎలాంటి ఆటగాడికైనా బాధ ఉంటుందన్నాడు. ఐతే ఆటలో ఉండగా ఎప్పుడు రిటైరవ్వాలన్నది ఏ ఆటగాడూ తేల్చుకోలేడని చెప్పాడు.
వేటు పడ్డాకే రిటైర్మెంట్ ఆలోచన వస్తుందన్నాడు. పదమూడేళ్ల పాటు దేశానికి ప్రాతినిథ్యం వహించిన ఆటగాడికి వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వరా అని అడుగుతున్నానని సెలక్టర్లను ప్రశ్నించాడు. అసలు తనను జట్టులోంచి తొలగించే వరకు రిటైర్మెంట్ ఆలోచన రాలేదన్నాడు.