టీ20 జట్టులో దక్కని చోటు:
ఈనెల 24 నుంచి బంగ్లాదేశ్-పాకిస్థాన్ జట్ల మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం తాజాగా పీసీబీ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో పాక్ వెటరన్ బ్యాట్స్మన్ షోయబ్ మాలిక్ (37), మొహమ్మద్ హఫీజ్ (39) లకు స్థానం కల్పించింది. అయితే దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న కమ్రాన్ అక్మల్కు మాత్రం చోటివ్వలేదు. దీంతో ఆగ్రహం చెందిన అక్మల్.. తాజాగా మీడియాతో పీసీబీపై మండిపడ్డాడు.
భారత్కి వెళ్లి ఆడాలా?:
'చాలా భాదగా ఉంది. ఏం చేయాలో పాలుపోవడంలేదు. నేను నమ్మకాన్ని కోల్పోను. అయితే దేనికైనా పరిమితి ఉంటుంది. పీసీబీలో కొత్త నిబంధనలు తీసుకొచ్చి ఐదేళ్లు అయింది. అత్యుత్తమ నైపుణ్యం, నిలకడగా రాణించే ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఎంపికవుతారు. అయితే నన్ను పక్కనపెట్టారు. నేను జాతీయ జట్టులో ఆడాలంటే భారత్కి వెళ్లి ఆడాలా? లేదా ఆస్ట్రేలియాకు వెళ్లాలా?' అని కమ్రాన్ అక్మల్ పీసీబీని ప్రశ్నించాడు.
ఇంకెంత కాలం ఓపిక పట్టాలి:
'నేను పాక్ ఆటగాడిని, గత ఐదేళ్లుగా దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నా. ఇంకెంత కాలం ఓపిక పట్టాలి? ప్రధాన మంత్రి కార్యాలయానికి వెళ్లి ఈ ఐదేళ్లలో ఎలా ఆడానని చెప్పాలా?. మంచి ప్రదర్శన చేసేవాళ్లని జట్టులోకి ఎంపిక చేసినా నాకు ఎలాంటి బాధలేదు. టీ20 జట్టులో అవకాశం ఉన్నా ఇతరులను బలవంతంగా ఆడిస్తున్నారు. నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. అవకాశం ఇవ్వండి. పీఎస్ఎల్, దేశవాళీలోని అన్ని ఫార్మాట్లలో బాగా రాణిస్తున్నా. కోచ్-సెలెక్టర్ మిస్బా ఉల్ హక్ ఈ విషయాలను పట్టించుకోవాలి' అని అక్మల్ అన్నాడు.
157 వన్డేలు, 58 టీ20లు:
కమ్రాన్ అక్మల్ క్వాయిడ్-ఎ-అజామ్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన రెండవ బ్యాట్స్మన్గా నిలిచాడు. 11 మ్యాచ్ల్లో 60.40 సగటుతో 906 పరుగులు చేసాడు. ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్ఎల్) 2019లో 13 మ్యాచ్ల్లో 357 పరుగులతో అక్మల్ అత్యధిక పరుగులు చేసి.. అక్కడ కూడా రెండవ స్థానంలో నిలిచాడు. అక్మల్ పాక్ తరపున 53 టెస్టులు, 157 వన్డేలు, 58 టీ20లు ఆడాడు.