ఇటీవల పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు రావడంపై చర్చ జోరుగా సాగింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆలస్యంగా ధోనీ బరిలోకి దిగడంపై మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ విమర్శించారు.
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 16 ఓవర్లకే సీఎస్కే 122 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. కానీ ధోనీ తొమ్మిదో స్థానంలో 19వ ఓవర్లో బ్యాటింగ్కు వచ్చాడు. అయితే తొలి బంతికే డకౌటయ్యాడు. హర్షల్ పటేల్ వేసిన స్లో డెలివరీకీ క్లీన్బౌల్డ్ అయ్యాడు. దీని గురించి ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. ధోనీ కాస్త ముందుగా బ్యాటింగ్కు వచ్చి ఉంటే చెన్నై మెరుగైన స్కోరు సాధించేదని అన్నాడు. ఆ స్థానంలో ధోనీ బ్యాటింగ్కు రావడం వల్ల సీఎస్కేకు ఎలాంటి ఉపయోగం లేదని పేర్కొన్నాడు.

మరోవైపు హర్భజన్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తొమ్మిదో స్థానంలో ధోనీ బ్యాటింగ్కు రావడం కంటే తుదిజట్టు నుంచి తప్పుకోవడమే ఉత్తమమని అన్నాడు. మరో ఫాస్ట్ బౌలర్కు అవకాశం ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ధోనీ కంటే ముందుగా శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్కు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
అయితే ఆలస్యంగా ధోనీ బ్యాటింగ్కు రావడానికి గాయమే కారణమని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ధోనీ మైదానంలో ఎక్కువసేపు పరిగెత్తలేడని కథనాలు వస్తున్నాయి. జాతీయ మీడియా వార్తల ప్రకారం.. 'ఐపీఎల్- 2024లో ధోనీ కాలి గాయంతో ఆడుతున్నాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల అతను స్వేచ్ఛగా కదలలేకపోతున్నాడు. అంతేగాక ధోనీ మైదానంలో ఎక్కువసేపు పరిగెత్తలేడు. మందులు తీసుకుంటూ, నొప్పిని తగ్గించుకుంటూ పరిగెత్తుతున్నాడు'.
సీఎస్కే సెకండ్ ఛాయిస్ వికెట్ కీపర్ డెవాన్ కాన్వే గాయంతో ఈ సీజన్కు దూరమైన విషయం తెలిసిందే. దీంతో మరో మార్గం లేక ధోనీ గాయంతోనే ఆడుతున్నాడని వార్తల్లో పేర్కొన్నారు. ''ఈ సీజన్లో మేం 'బీ' టీమ్తో ఆడుతున్నాం. ధోనీని విమర్శించే వాళ్లకు అతను ఏం త్యాగం చేస్తున్నాడో తెలియదు'' అని సీఎస్కే అధికారి ఒకరు తెలిపారు. కాగా, గత సీజన్లోనూ ధోనీ మోకాలి గాయంతోనే ఆడాడు. ధోనీ ప్రస్తుత వయస్సు 42 ఏళ్లు.