
భారత బ్యాటింగ్ స్టార్ కేఎల్ రాహుల్ను బ్యాడ్లక్ వెంటాడుతోంది. ఇటీవలే హెర్నియా కారణంగా జట్టుకు దూరమైన రాహుల్ తిరిగి కోలుకుని పూర్తి ఫిటినెస్ సాధించాడు. ఇక ట్రినిడాడ్లో జూలై 29న ప్రారంభమయ్యే వెస్టిండీస్, భారత్ మధ్య జరిగే 5మ్యాచ్ల టీ20 సిరీస్కు రాహుల్ ఎంపికయ్యాడు. ఇక తిరిగి జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చే ముందు మళ్లీ అతన్ని కరోనా అడ్డుకుంది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్, ఫిట్ నెస్ కసరత్తులు చేస్తూ బిజీబిజీగా ఉన్న కేఎల్ రాహుల్కు గురువారం కరోనా పాజిటివ్ వచ్చింది. వెస్టిండీస్తో జరిగే టీ20 సిరీస్కు ముందు అకాడమీలో శిక్షణ పొందుతుండగా.. అతను కరోనా బారిన పడడంతో ఐసోలేషన్, తదితర కరోనా నిబంధనలు పాటించిన అనంతరమే వెస్టిండీస్కు వెళ్లాల్సి ఉంటుంది. ఇక అందుకు ఓ వారం పట్టొచ్చు. దీంతో వెస్టిండీస్కు రాహుల్ వెళ్లడం డౌటేనని తెలుస్తోంది. ఒకవేళ అతను వెస్టిండీస్కు వెళ్లినా.. తొలి రెండు మ్యాచ్లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది.
ఇకపోతే హెర్నియా నుంచి పూర్తిగా కోలుకుంటేనే అతన్ని వెస్టిండీస్కు పంపిస్తామని సెలెక్షన్ కమిటీ పేర్కొన్న సంగతి తెలిసిందే. అందువల్ల జులై 22 నుండి ప్రారంభమయ్యే 3 మ్యాచ్ల వన్డే సిరీస్కు రాహుల్ ఎంపిక కాలేదు. కానీ టీ20 సిరీస్కు ఎంపికవ్వడంతో అంతలోపు పూర్తిగా కోలుకుని ఫిట్నెస్ సాధించగలడని అంతా అనుకుంటున్న తరుణంలో కరోనా అతన్ని దెబ్బకొట్టింది. ఇకపోతే ఇటీవల ఎన్సీఏలో ఔత్సాహిక క్రికెట్ కోచ్లతో సంభాషించినందుకు కేఎల్ రాహుల్కి ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ గురువారం కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశాడు.
కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2022లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్సీ వహించి ఆ జట్టును ప్లేఆఫ్ వరకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ తర్వాత అతను ఇక ఎలాంటి క్రికెట్ ఆడలేదు. ఐపీఎల్ అనంతరం జూన్లో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే 5మ్యాచ్ల సిరీస్కు రాహుల్ను టీ20 జట్టుకు కెప్టెన్గా సెలెక్షన్ కమిటీ నియమించింది. అతను అనూహ్యంగా గాయపడడంతో ఆ సిరీస్కు దూరమయ్యాడు. దీంతో రిషబ్ పంత్ను స్టాండ్-ఇన్ కెప్టెన్గా సెలెక్టర్లు నియమించారు. రాహుల్ ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు కూడా దూరమయ్యాడు. అతను హెర్నియా ఆపరేషన్ కోసం జర్మనీకి వెళ్లాడు. ఆపరేషన్ అనంతరం కొన్నాళ్లు రెస్ట్ తీసుకున్న రాహుల్ తర్వాత శిక్షణ, ఫిట్ నెస్ కోసం తిరిగి ఎన్సీఏకు వచ్చాడు. అక్కడ కసరత్తులు, ప్రాక్టీసు చేస్తున్నాడు. ఈ టైంలో మళ్లీ కరోనా బారిన పడ్డాడు.